హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఏఎన్బీ) మత్తు నిషాను వదిలిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఏఎన్బీ.. అద్భుత ఫలితాలను ఇస్తున్నది. ఏఎన్బీ డైరెక్టర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దులు మొదలుకొని, తెలంగాణ మీదుగా ఇతర రాష్ర్టాలకు అక్రమంగా తరలించే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొని, అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. యువత మత్తు పదార్థాల జోలికి పోకుండా అవగాహన కల్పిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం (జూన్ 26న) సందర్భంగా ‘పరివర్తన’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
నాలుగేండ్లలో 8,227 మంది అరెస్టు
గంజాయి, ఇతర సింథటిక్ డ్రగ్స్పై ప్రత్యేక దృష్టిపెట్టిన పోలీసులు.. గత నాలుగేండ్లలో 3,612 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశారు. మత్తు పదార్థాలు తరలిస్తున్న 8,227 మందిని అరెస్టు చేశారు. 476 మందిపై పీడీ యాక్టులు నమోదు చేశారు. సుమారు వంద టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. అరెస్టయిన వారిలో 84 మంది విదేశీయులు ఉన్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణాపై నిత్యం నిఘా
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో ఐదంచెల తనిఖీలతో డ్రగ్స్ స్మగ్లర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు పోలీసులు. ఏపీ నుంచి ముంబైకి, బెంగళూరు నుంచి ఏపీకి డ్రగ్స్ తరలించే క్రమంలో తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకోవటం వారి వల్ల కావటం లేదు. ఎన్ని అక్రమ మార్గాల్లో డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తున్నా అన్ని లింకులను విజయవంతంగా ఛేదిస్తున్నారు. పోలీసుల పనితీరుతో గత ఏడాది నార్కోటిక్ కేసులు 6 శాతం తగ్గాయి. ఏఎన్బీ నిఘాతో విదేశీయులు కూడా తెలంగాణ వైపు చూడాలంటే గజగజ వణికిపోతున్నారు.
‘పరివర్తన’ తీసుకొస్తున్నాం
యువత ఆలోచనలు పెడదారి పట్టకుండా ‘పరివర్తన’ పేరుతో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అన్ని కాలేజీల్లో యాంటీ డ్రగ్ సోల్జర్స్ను తీసుకొస్తున్నాం. డ్రగ్స్ నియంత్రణలో వీరు మాతో కలిసి పనిచేస్తారు. స్నేహితులు డ్రగ్స్ బారిన పడకుండా చూసుకొనే బాధ్యత వీరిదే. డ్రగ్స్ను తెలంగాణ నుంచి తరిమికొట్టేందుకు, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు మన పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్