వరంగల్ : మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు అని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణ లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు 2 కోట్ల 17 వేలమందికి వాక్సిన్ ఇచ్చామన్నారు. వీరిలో ఒక కోటి 45 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. 55 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది అని మంత్రి పేర్కొన్నారు.