హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు వారాల్లోనే ఎనిమిదిన్నర రెట్లు పెరిగింది. ఈ నెలారంభంలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన వైరస్ వ్యాప్తి 14 రోజుల్లోనే రాష్ట్రం మొత్తం చుట్టేసింది. ఈ నెల 1న 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 19 జిల్లాల్లో సగటున మూడు కేసుల చొప్పున నమోదయ్యాయి. 14వ తేదీ నాటికి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి మినహా మిగిలిన 30 జిల్లాల్లో సగటున 31 కేసుల చొప్పున నమోదయ్యాయి. రెండు వారాల్లోనే జిల్లాల్లో సగటు కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. సంక్రాంతి పండుగ తరువాత రాష్ట్రంలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తున్నది. పండుగకు గ్రామాలకు వెళ్తున్నవారు, తిరిగొస్తున్నవారితో పాటు ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాలని సూచిస్తున్నారు.
పంచసూత్రాలే రక్షణ కవచాలు
పండుగల వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు. థర్డ్ వేవ్ నుంచి తక్కువ నష్టంతో బయటపడొచ్చు. ప్రతి ఒక్కరూ ఊళ్లలోనూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. గుమిగూడటం మానేయాలి. భౌతిక దూరం పాటించాలి. వీలైనంతవరకు కుటుంబ సభ్యులతోనే పండుగ చేసుకోవాలి. కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు తరుచూ శానిటైజ్ చేసుకోవాలి.
-డాక్టర్ ఎంవీ జగన్నాథం, సీసీఎంబీ మాజీ చీఫ్ సైంటిస్ట్