హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కొత్త రెవెన్యూ జిల్లాలను జ్యుడిషియల్ డిస్టిక్ట్స్గా పరిగణిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సంఖ్య 33కు పెంచినప్పటికీ పాత పది జిల్లాల్లోనే జ్యుడిషియల్ కోర్టులు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు హైకోర్టు 33 జ్యుడిషియల్ జిల్లాలకు ఆమోదం లభించింది. హైకోర్టు సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకొన్నది. ఇవన్నీ జూన్ 2 నుంచి పనిచేస్తాయి. ఇక నుంచి రాష్ట్రంలో మొత్తం 33 జ్యుడిషియల్ జిల్లాలవారీగా కోర్టులు పనిచేస్తాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కే సుగుణ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వినతిని హైకోర్టు ఆమోదించిన తర్వాతే కొత్త జిల్లాలను కూడా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్గా పరిగణిస్తున్నట్లు వివరించారు.
ఉమ్మడి జిల్లాలవారీగా ఉన్న కేసులను కొత్త జిల్లాలకు బదిలీ అవుతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేసుల వివరాలను హార్డ్ కాపీ, ఈ-మెయిల్ ద్వారా ఈ నెల 24లోగా హైకోర్టుకు నివేదించాలని జిల్లా కోర్టులకు ఆదేశాలిచ్చినట్టు వివరించారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన భవనాలు, మౌలిక వసతులను కల్పిస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ న్యాయాధికారుల సమావేశంలో హామీ ఇచ్చారు.