నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 5 (నమస్తే తెలంగాణ): చెన్నూరు మాజీ ఎమ్మల్యే బాల్కసుమన్పై నాంపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు ఎందుకు బదిలీ చేశారని జడ్జి శుక్రవారం పోలీసులను ప్రశ్నించారు. దీనిపై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని బంజారాహిల్స్ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అంతకుముందు సుమన్ తరఫున న్యాయవాది జీ కిరణ్కుమార్ వాదన వినిపిస్తూ.. ఈ కేసు బదిలీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణి భవన్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నందున సంబంధిత అధికారి ఆనంద్ ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని, గత నెల 30న అరెస్టయిన సుమన్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారని వివరించారు.
ప్రస్తుతం సుమన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసు బదీలీ అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తున్న తెలంగాణ భవన్ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్నందున ఈ కేసును బదిలీ చేయాలని పోలీసులు కోరడం సమంజసం కాదని, ఈ కేసు నుంచి తొలగించిన కొన్ని సెక్షన్లను మళ్లీ జోడించడం చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. అనంతరం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.