MLC Kavitha | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై ఈ నెల 10న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనున్నది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోఉన్న కవితను సీబీఐ ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు గత శుక్రవారం అనుమతించిన విష యం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాది నితీశ్రాణా శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవితను ప్రశ్నించేందుకు కోర్టులో సీబీఐ దాఖలు చేసిన దరఖాస్తు తమకు అందించలేదని, అందుకే దీనిపై విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కోరారు.
దీనిపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా స్పందిస్తూ.. కవితను ప్రశ్నించేందుకు ఏ నిబంధన ప్రకారం దరఖాస్తు చేశారో చెప్పాలని, ఈ విషయంలో కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేశారు. అనంతరం కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని సీబీఐ కోరడంతో ఈ నెల 10 వరకు గడువు ఇచ్చిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్టు ప్రకటించారు. కాగా, కవితను సీబీఐ విచారించడంపై స్టేటస్కో ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆమె తరపు న్యాయవాది అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్పై వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని తెలిపింది.