నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్పోర్టు కేసులో కరీంనగర్కు చెందిన చాంద్ఖాన్తోపాటు తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చిన జేవియర్ను న్యాయస్థానం సీఐడీ కస్టడీకి అప్పగించింది. చాంద్ఖాన్ను 5 రోజులు, జేవియర్ను 2 రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఇద్దరు నిందితులను సోమవారం జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు. ఫేక్ పాస్పోర్టుల తయారీ కోసం నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ, ఇతర సర్టిఫికెట్లను రూపొందించేందుకు తప్పుడు అడ్రస్లను అందించిన వ్యవహారంపై చాంద్ఖాన్ను.. నకిలీ పాస్పోర్టులు పొందిన శ్రీలంక జాతీయులు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారన్న దానిపై జేవియర్ను సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తద్వారా ఈ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉన్నదో తెలుసుకోనున్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తున్నది.