వరంగల్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ను నైపుణ్య, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్ ్జ(టాస్క్) సెంటర్ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే లక్షల మందికి శిక్షణ ఇస్తున్న టాస్క్ వరంగల్ నగర యువతకూ అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటికే పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్లో టాస్క్ కేంద్రాన్ని ప్రారంభించారు.
నగర శివారులో వరుసగా ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలు, టెక్స్టైల్ పార్కు, ఇతర ఉత్పాదక కంపెనీలకు అనుగుణంగా ఇక్కడి కేంద్రంలో కోర్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. టాస్క్ కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వ పరిధిలోని ఒక పెద్ద భవనాన్ని ఎంపిక చేశారు. నగరానికి ఉండే ప్రత్యేకతలతో సాఫ్ట్వేర్ పరిశ్రమలను ఇక్కడ విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ ప్రణాళికలో భాగంగానే ఇప్పటికే మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, సయంట్, క్వాడ్రంట్, సాఫ్ట్ పాత్ కంపెనీలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయి. త్వరలోనే జెన్ప్యాక్ట్ వంటి మరికొన్ని కంపెనీలు రానున్నాయి.
దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పరిశ్రమల కేంద్రంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. పలు కంపెనీలు ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించాయి. మరికొన్ని కంపెనీలు ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. టెక్స్టైల్ పార్కులో వందల కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. ప్రపంచంలోనే ఫార్మా ఉత్పత్తి ప్రధాన కేంద్రంగా ప్రస్తుతం హైదరాబాద్కు పేరున్నది. విస్తరణలో భాగంగా పలు ఫార్మా కంపెనీలు వరంగల్ నగరం చుట్టుపక్కల ఏర్పాటు కానున్నాయి. నగరానికి వచ్చే ఐటీ, టెక్స్టైల్, ఫార్మా పరిశ్రమలకు భారీ స్థాయిలో మానవ వనరులు అవసరమవుతాయి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ టాస్క్ సేవలను విస్తరిస్తున్నారు. ఉపాధి కల్పనకు అవసరమైన విధానాలను అమలు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు ఆ అవకాశాలను దక్కించుకొనేలా యువతలో నైపుణ్యాన్ని పెంచడం దిశగా చర్యలను ప్రారంభించారు.