Sangareddy | జహీరాబాద్ : పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో రైతుదంపతులిద్దరు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరా సంఘ మండలంలోని బిడకన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మరియమ్మ (32) ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద పనులు చేసేందుకు వెళ్లింది. వ్యవసాయ బోరు వద్ద ఉన్న ఫెన్సింగ్ కరెంటు రావడంతో మరియమ్మ కరెంటు షాక్ తగిలి అక్కడేపడిపోయింది.
ఆ తర్వాత ఆమె భర్త దేవిదాస్ (35) పొలం వద్దకు వచ్చాడు. భార్య మరియమ్మ కిందపడి ఉండడం చూసి.. ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. రైతు దంపతులకు కొడుకు మనోజ్ (14), మానస (11) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.