ఇబ్రహీంపట్నం, మే 31: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం తనువు చాలించింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి దంపతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని కుర్మల్గూడలో మంగళవారం వెలుగుచూసింది. హైదరాబాద్ మలక్పేట సమీపంలోని సంతోష్నగర్కు చెందిన కుద్దూస్పాషా (37), ఫాతిమా(28) దంపతులు. వీరికి మహెక్బేగం (9), ఫిర్దోషాబేగం (6) కూతుళ్లు ఉన్నారు.
కుద్దూస్పాషా ఓ వెల్డింగ్షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవడానికి భార్యాభర్తలు నిర్ణయించుకొన్నారు. పిల్లలను కూడా తమతోపాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నారు. సోమవారం రాత్రి కుమార్తెలతో కలిసి నాదర్గుల్ సమీపంలోని కుర్మల్గూడ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం తండ్రి, కుమార్తెల మృతదేహాలు నీటిలో తేలాయి. అనంతరం చెరువులో గాలించగా ఫాతిమా మృతదేహం లభ్యమైంది.