నల్లగొండ : రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని అనేక అద్భుతమైన సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ను తిట్టడము, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీల నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే పని చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు.
నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా దేశం తిరోగమనంలో ప్రయాణిస్తున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వ పాలననే ప్రధాన కారణమని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కన్నా మన దేశ జీడీపీ శాతం తక్కువగా ఉంది. ఆహార సమస్యతో,ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న దేశాల జాబితాలోకి మన దేశం చేరిందని గుర్తు చేశారు. గత ఎనిమిది సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు అధికంగా పెరిగాయి. ధరలను కంట్రోల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని పేర్కొన్నారు.
దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. ధరలను కంట్రోల్ చేసే సర్కార్, మత సామరస్యాన్ని కాపాడే సర్కార్ కావాలని మండలి చైర్మన్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వాలుగా మారాయని ఎద్దెవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది అని తెలంగాణ బీజేపీ నేతలు అనడం సిగ్గుచేటు. వారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనే కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించిన విషయాన్ని గుత్తా గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిందన్నారు మండలి చైర్మన్. రాహుల్ గాంధీని రాష్టానికి తీసుకువచ్చి రైతు సంఘర్షణ సభ అని పెట్టారు.. అసలు ఆ సభ ఎందుకు పెడుతున్నారో వారికే తెలియదని విమర్శించారు. కాంగెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్ లాంటి పథకాలు అమలు చేసి, ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. అది మన ఒక్క రాష్టానికే సాధ్యమని గుత్తా సుఖేందర్ రెడ్డి తేల్చిచెప్పారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొత్తగా ఇల్లు కట్టుకుంటేనే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి.. అలాంటిది అంత పెద్ద ఆలయ నిర్మాణం జరిగినప్పుడు చిన్న సమస్యలు వస్తాయన్నారు. తెలంగాణ సర్కార్కు యాదాద్రి ఆలయ అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ ఉంది. అన్ని సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు.