నల్లగొండ, ఏప్రిల్ 15 : తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ధాన్యం కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు.
కేంద్ర మంత్రులు రాష్ర్టాలపై విమర్శలు చేయడం.. రాష్ర్టాల్లో జాతీయ పార్టీ నాయకులు తామే మెడలు వంచి కొనుగోలు చేయిస్తున్నామని అనడం సరికాదన్నారు. సహాయం చేయని వారికి విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్వింటాల్ ధాన్యం రూ.1,300 నుంచి రూ.1,500 వరకు మాత్రమే ఉండటంతో అక్కడి రైతాంగం తెలంగాణలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నదంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, ఏ రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ విధంగా కొనడం లేదని చెప్పారు. ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నదన్నారు.