హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో పంటల సాగులో పత్తి (దూదిపూలు) టాప్లో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 50,85,114 ఎకరాల్లో పత్తి సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. పత్తి తర్వాత 49,87,358 ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పటివరకు సాగైన మొత్తం పంటల్లో ఈ రెండుపంటల సాగు విస్తీర్ణమే కోటి ఎకరాలు దాటడం విశేషం. మొత్తం సాగులో వీటి వాటా ఏకంగా 82 శాతంగా ఉన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.22 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ వెల్లడించింది. కంది పంట 8.98 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 3.48 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న పంట అంచనాలకు మించిసాగైంది. గతేడాది 2.17 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేయగా.. ఈసారి ఏకంగా 6.12 లక్షల ఎకరాలకు పెరిగింది. గత వానకాలం సీజన్తో పోల్చితే ఈ సీజన్లో పంటల సాగు తగ్గింది. గతంలో 1.30 కోట్ల ఎకరాల్లో సాగు కాగా ఈసారి 1.22 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది సీజన్కు ముందే విస్తారంగా వర్షాలు పడటం, ఈసారి ఆలస్యం రావడంతో పంటల సాగుపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. అంతకు ముందు సీజన్తో పోల్చితే భారీగానే సాగైందని పేర్కొన్నారు.