గజ్వేల్, నవంబర్ 8: పత్తికి సీసీఐ ప్రకటించిన ధర కన్నా ఎక్కువే పలుకుతున్నది. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాల్ ధర రూ.8,453 పలికింది. 44 మంది రైతులు 132.15 క్వింటాళ్ల పత్తిని మార్కెట్కు తీసుకురాగా వ్యాపారులు ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా నాణ్యమైన పత్తి క్వింటాల్కు రూ.8,453 చెల్లించారు. అత్యల్పంగా క్వింటాల్కు రూ.8,200 పలికింది. దీపావళి తర్వాత ఇతర రాష్ర్టాల్లో పత్తి ధర తగ్గడంతో గజ్వేల్ మార్కెట్లోనూ కాస్త తగ్గింది. దీపావళికి ముందు ఇక్కడ రూ. 8,755 ధర పలికిన విషయం తెల్సిందే. ఇప్పటివరకు గజ్వేల్ మార్కెట్లో 539 మంది రైతుల నుంచి 1,409 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, రైతులకు రూ.1,14,29,316 చెల్లించినట్టు మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ తెలిపారు.