వరంగల్: తెల్లబంగారం సిరులు కురిపిస్తున్నది. మార్కెట్లో పత్తి ధర (Cotton price) పైపైకి పోతున్నది. వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. మంగళవారం క్వింటాలు పత్తి రూ.10,230 పైచిలుకు అమ్ముడుపోగా, బుధవారం అది రూ.10,310కి చేరింది. మార్కెట్ చరిత్రలో పత్తికి ఇదే అత్యధిక ధర కావడం విశేషం. దీంతో పత్తికి భారీగా ధర పలుకుతుండటంతో.. అమ్మడానికి వచ్చిన రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం జఫర్గడ్ గ్రామానికి చెందిన రైతు మంగళవారం.. 17 బస్తాల పత్తిని మార్కెట్కు తెచ్చాడు. దీనికి ఖరీదుదారులు గరిష్ట ధర రూ. 10,235 నిర్ణయించారు.