పెద్దపల్లి టౌన్/బూర్గంపహాడ్, ఫిబ్రవరి 6: పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేచి చూసినా ధరలు నిర్ణయించక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదుట రాజీవ్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. మార్కెట్లో విక్రయించుకునేందుకు పత్తి తీసుకువస్తే కొనుగోలుదారులు సర్వర్ డౌన్ ఉన్నదని చెప్పి ప్రతి రోజూ ఇలానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకొని ఎస్సై మల్లేశ్ అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం పత్తి కొనుగోలుదారులు మద్దతు ధర నిర్ణయించడంతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
తరుగు తీయొద్దని డిమాండ్
పత్తిని కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం శివారులోని జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. లక్ష్మీపురంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన రైతులు తమ పత్తిని జిన్నింగ్ మిల్లు వద్ద విక్రయించేందుకు వెళ్లగా.. దిగుమతి చేసుకోకుండా క్వింటాకు 10 కిలోల చొప్పున తారం (తరుగు) తీస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తెచ్చిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో సుమారు కిలోమీటర్ మేర రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.