హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్ నుంచి పత్తి రైతుల పంట పండనున్నది. పత్తి దిగుబడి, ఆదాయం మూడింతలు పెరగనున్నది. ఇందుకు సంబంధించి ఈ వానకాలం సీజన్ నుంచి పత్తి సాగులో కొత్త విధానం అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇందులో భాగంగానే అధిక సాంద్రత పద్ధతి (హై డెన్సిటీ ప్లాంటేషన్)లో పత్తి సాగును ప్రవేశపెట్టనున్నది. దీంతో పాటు ఒకే కాతలో (సింగిల్ పికింగ్) పత్తి పంట పూర్తయ్యేలా కొత్త విధానం అమలు చేయనున్నది. ప్రస్తుతం పత్తి సాగు విధానంలో ఎకరాకు ఏడెనిమిది వేల మొక్కలు పెరిగితే అదే ఎక్కువ. కానీ ఇప్పుడు కొత్త సాగు విధానంలో మూడు రెట్ల అధిక మొక్కలను పెంచేందుకు అవకాశం దక్కింది. అంటే ఎకరాకు 25 వేల వరకు మొక్కలను పెంచే వీలుంది. ఈ రెండు విధానాలకు సంబంధించి ఇప్పటికే వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గత రెండేండ్లుగా విస్తృత పరిశోధనలు జరిగాయి. అక్కడ ఈ రెండు విధానాలూ విజయవంతమయ్యాయి. దీంతో ఈ సీజన్లో ప్రైవేటు విత్తన కంపెనీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నూతన పత్తి సాగు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రైతులతో ఈ సీజన్లో తొలిదశను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
పాత విత్తనాలు.. కొత్తగా సాగు
ప్రస్తుతం అమలు చేయబోతున్న నూతన విధానంలో పాత విత్తనాలనే ఉపయోగిస్తారు. సాగు విధానంలో మాత్రం కొత్త యాజమాన్య పద్ధతులను అవలంబిస్తారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న విత్తనాలే చల్లుతారు. హైబ్రిడ్ రకాలైన విన్నర్, సిరి, ఎన్సీఎస్-2728 రకాలతో పాటు పీకేవీ-081, సూరజ్, రజత్, జీఎస్హెచ్వీ-374 విత్తనాలను ఉపయోగించుకోవచ్చు. ఈ నూతన విధానంలో మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా నియంత్రిస్తారు. ఇందుకోసం కొత్తగా ‘మెపిక్వాట్ క్లోరైడ్’ రసాయనాన్ని పంటకు పిచికారి చేయనున్నారు. ఇది 40-60 రోజుల్లో ఒకసారి, 70-80 రోజులకు ఒకసారి పిచికారి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మొదటిసారి పూతదశలో లీటరు నీటిలో 1.5 మిల్లీ లీటర్లు, రెండోసారి కాయ దశలో 2 మిల్లీ లీటర్లు పిచికారి చేయాల్సి ఉంటుంది. ఈ ద్రావణం మొక్క పెరుగుదలను నియంత్రించి ఒకేసారి పూత, కాత వచ్చేలా చేస్తుంది. ఈ నూతన విధానంతో పత్తి దిగుబడి కూడా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. హైబ్రిడ్ రకాల్లో ఎకరాకు 13-15 క్వింటాళ్లు, సాధారణ రకం విత్తనాల్లో 7-8 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. నీటి పారకం ద్వారా సాగు చేస్తే హైబ్రిడ్ రకాల్లో ఏకంగా 20-25 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
25 వేల మొక్కలు.. ఒకేసారి పంట చేతికి
ప్రస్తుతం అనుసరిస్తున్న సాగు విధానంలో ఎకరాకు 7-8వేల మొక్కలు పెరుగుతాయి. కానీ కొత్త విధానంలో మొక్కల సంఖ్య ఏకంగా 25వేలకు పెరగనుంది. అంటే ఒకేసారి మూడు రెట్ల మొక్కలు పెరుగనున్నాయి. ఇందుకోసం మొక్కల మధ్య, సాళ్ల మధ్య దూరాన్ని తగ్గిస్తారు. ప్రస్తుత విధానంలో మొక్కల మధ్య దూరం 60-90 సెం.మీ. కాగా కొత్త పద్ధతిలో దీన్ని 20 సెం.మీ.లకు తగ్గించారు. సాళ్ల మధ్య దూరం ప్రస్తుతం 100-120 సెం.మీ. ఉండగా దీన్ని 80 సెం.మీలకు తగ్గించనున్నారు. దీంతో ఎక్కువ మొక్కలు నాటేందుకు వీలుంటుంది. ప్రస్తుత విధానంలో పత్తి పంటను రెండు లేదా మూడు సార్లు తెంపుతున్నరు. కానీ నూతన విధానంలో కొత్త యాజమాన్య పద్ధతి కారణంగా పంట మొత్తం ఒకేసారి తెంపే వీలుంటుంది.
పత్తి క్వింటాల్ ధర రూ.14 వేలు
పత్తి ధర పరుగులు పెడుతున్నది. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో, వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. కాగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈ సీజన్లో 5,98,500 క్వింటాళ్ల పత్తి వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.