హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాఫేల్ అవినీతిని బయటకు తీస్తామని, అసరమైతే సుప్రీం కోర్టుకైనా పోతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అవినీతిని బద్దలుకొడ్తామని తేల్చిచెప్పారు. తనను జైల్లో పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. ప్రగతిభవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…
అవినీతిని బయటపెడతం
నన్నెవడు.. జైల్లో పెట్టేది? నిజంగా జాలి అనిపిస్తది. దమ్ముంటే వేయాలె కదా? ఎవడో తోకగాడు జైల్లో వేస్తానంటే భయపడ్తమా? దా దమ్ముంటే జైల్లో వేయి. జైలు అంటే దొంగలకు భయం. లంగలకు భయం. నాకేం భయం. కానీ మిమ్మల్ని వేసేది పక్కా. భయంకరమైన అవినీతి చిట్టా ఉన్నది. పుంఖానుపుంఖాలుగా ఇంకా వస్తున్నాయి. రాఫెల్డీల్లో అవినీతి జరిగిందని రాహుల్గాంధీ మాట్లాడారు. దానికి క్లీన్చిట్ తీసుకున్నామని చెప్తున్నారు. ఆధారలు చూపించాలి కదా. రాఫెల్పై సుప్రీంకోర్టులో కేసు వేస్తం. అవినీతిని బయటపెడతం. మోదీ ప్రభుత్వంలో వేల కోట్లు మింగిండ్రు. 36 రాఫెల్ జెట్స్ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు మనం కొన్నాం. అదే ఇండోనేషియా 42 రాఫెల్ జెట్స్ (మనకంటే 6 ఎక్కువ) కేవలం 8 బిలియన్ డాలర్లకు కొన్నది. ఇందులో ఎవడు దొంగ? రాఫెల్ విమానాలను తెలంగాణ కొనలేదు కదా? తమిళనాడు అయితే కొనలేదు కదా. ఇదీ కుంభకోణం. ఎవడు జైలుకు పోవాల్నో వాడు పోవాలె. 33 బ్యాంకులను ముంచి పారిపోయింది నిజమే. దీని పాపాత్ములు ఎవరు? దీని మీద చర్చ పెట్టాలె. దీనిమీద ఢిల్లీల 100 శాతం పంచాయితీ పెడతా. మొత్తం తెల్వాలె. ఒక్క రాఫెల్నే కాదు. చానా ఉన్నయి. అవన్నీ వరసబెట్టి చెప్తాం. బీజేపీ వాళ్లు చర్చకు వస్తే మంచిదేగా. మేం కూడా వాళ్లు పవిత్రంగనే ఉండాలని కోరుకుంటున్నం. బంగారం కాలితేనే కదా? నిజమైన బంగారమేదో.. కల్తీ బంగారమేదో తేలేది? బీజేపీ వాళ్లు రావాల. చర్చ పెట్టాల. మేం వందశాతం ప్యూర్. మాకు అట్ల లేవు. అక్రమాలు, బక్రమాలు. అన్నీ పిచ్చి పిచ్చి కథలు మాకు లేవు. మేం అట్ల బతకలేం.
బీజేపీ.. దీనిపై చర్చకు సిద్ధమా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు బలపరుస్తూ తాజాగా మరో విషయం బయటపడింది. ఐదేండ్ల కిత్రం ఫ్రాన్స్తో మోదీ సర్కారు చేసుకున్న రాఫెల్ డీల్కి, తాజాగా ఇండోనేషియా చేసుకున్న ఒప్పందం మధ్య ఉన్న వ్యత్యాసం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెండు ఒప్పందాల ప్రకారం ఒక్కో రాఫెల్ జెట్ కోసం ఇండోనేషియా కంటే భారత ప్రభుత్వం ఎక్కువగా వెచ్చిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం 2016లో ఫ్రాన్స్తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై తొలి నుంచి తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి చోటుచేసుకున్నదని ప్రతిపక్షాలతో పాటు పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికి బలం చేకూర్చేలా ఇప్పటికే పలు రిపోర్టులు బయటకు వచ్చాయి. ఒప్పందం కుదిరించేందుకు మధ్యవర్తికి ముడుపులు కూడా అందాయని ఫ్రెంచ్ మీడియా పార్ట్ రిపోర్టు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇండోనేషియాతో ఫ్రాన్స్ ఒప్పందం
ఇండోనేషియాకు 42 రాఫెల్ విమానాలను అందించేందుకు ఫ్రాన్స్ 810 కోట్ల డాలర్ల (సుమారు రూ.61 వేల కోట్లు) ఒప్పందం చేసుకున్నది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి గురువారం తెలిపారు. దీనికి, బీజేపీ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందానికి తేడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. కేవలం 36 రాఫెల్ జెట్ల కొనుగోలు కోసం మోదీ ప్రభుత్వం 2016లో 880 కోట్ల డాలర్ల (రూ.66 వేల కోట్లు) కోట్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు ఒప్పందాల్లో ఒక్కో జెట్కు చెల్లింపులో భారీ తేడా ఉండడంతో మోదీ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందంలో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు నిజమేనన్న విషయం తేటతెల్లమవుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెరగాల్సింది పోయి.. తగ్గింది
బీజేపీ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో జెట్ కోసం మన ప్రభుత్వం దాదాపుగా రూ.1,600 కోట్లు చెల్లిస్తున్నది. అదేవిధంగా ఇండోనేషియాకు మాత్రం ఒక్కో జెట్ను దాదాపు రూ.1,450 కోట్లకు ఫ్రాన్స్ అందిస్తున్నది. ఇండోనేషియా ఒప్పందంతో పోల్చుకుంటే గణాంకాల ప్రకారమే.. మోదీ ప్రభుత్వం ఒక్క రాఫెల్ జెట్ కోసం అదనంగా దాదాపు రూ.150 కోట్ల మేర చెల్లిస్తుందన్న మాట. ఇంకో అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉన్నది. ఫ్రాన్స్తో భారత్, ఇండోనేషియా కుదుర్చుకున్న ఒప్పందాల మధ్య ఐదు ఏండ్ల వరకు సమయం తేడా ఉన్నది. ఈ ఐదేండ్లలో అనేక పరిణామాలు, గత రెండేండ్లుగా కొవిడ్ సంక్షోభంతో ఆర్థిక పరిస్థితులు తారుమరయ్యాయి. ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. ఇటువంటి సమయంలో అప్పటి డీల్కి.. ఇప్పటి డీల్లో చెల్లించే డబ్బు పెరగాల్సింది పోయి.. తగ్గడం చర్చకు దారితీసింది. మోదీ సర్కార్ ఒప్పందంలో జరిగిన అవినీతి కారణంగానే ఈ వ్యత్యాసం ఉన్నదనే వాదనలకు బలం చేకూరుతున్నది. రాఫెల్ ఒప్పందంలోని ప్రతి అడుగు ప్రధాని మోదీకి తెలిసే జరిగిందని, ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నదనేది కాంగ్రెస్తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ. ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ చేయించి, నిజాలు నిగ్గు తేల్చాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.