హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకొనేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకూ కొర్రీలు పెడుతున్నది. కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తున్నది. విమాన ప్రయాణాలను ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తున్నది. ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలు విమానాశ్రయాలకు అనకూలమేనని మూడేండ్ల క్రితమే ప్రాథమిక నివేదిక అందించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. తుది నివేదికను సమర్పించకుండా తాత్సారం చేస్తున్నది. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ఐటీ రంగంతోపాటు వివిధ పరిశ్రమలను ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 6 ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వరంగల్ జిల్లాలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్నగర్, ఆదిలాబాద్లో 3 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు నిర్మించాలని భావించింది. వీటితోపాటు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్రలో మరో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాలని పలుమార్లు కోరినా నరేంద్రమోదీ సర్కార్ పట్టించుకోవడం లేదు. కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని గుర్తుచేశారు. విమానాశ్రయాల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. అయినా కేంద్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది.
ఆదిలాబాద్, జక్రాన్పల్లి, మామునూరులో ఇప్పటికే రన్వేలు ఉన్నందున అక్కడ త్వరగా విమానాశ్రయాలను ఏర్పాటు చేయవచ్చని ఏఏఐ అధికారులు గతంలో హైదరాబాద్కు వచ్చినప్పుడే స్పష్టం చేశారు. తదనుగుణంగా 2019లో ప్రాథమిక నివేదిక ఇచ్చారు. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో రన్వేల మరమ్మతులు, ఇతర ఏర్పాట్లకయ్యే అంచనా వ్యయంతో తుది నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తొలిదశలో చిన్న విమానాలు నడిపేందుకు చేపట్టాల్సిన చర్యలు, అందుకయ్యే ఖర్చును నివేదించాలని విన్నవించింది. దీనిపై అటు ఏఏఐ అధికారుల్లో గానీ ఇటు మోదీ సర్కార్లో గానీ ఎలాంటి చలనం లేదు.
తెలంగాణపై ఆది నుంచే వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. అడుగడుగునా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నది. అనేక విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రతి అంశంలోనూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. ఇప్పుడిక ఎయిర్పోర్టుల వంతు వచ్చింది. 6 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసినా, స్వయంగా ముఖ్యమంత్రే విన్నవించినా పట్టించుకోకపోవడం బీజేపీ సర్కారుకే చెల్లింది. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీకి ఇంత వివక్ష ఎందుకని యావత్ రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నిస్తున్నది. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను కట్టిపెట్టి ఇకనైనా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నది.