హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): దండుమల్కాపూర్లో బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఈ పార్క్లో సాధ్యమైంత త్వరగా తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు. మంగళవారం టీఎస్ఐఐసీ అధికారులు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బొమ్మల తయారీకి అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా మెరుగ్గా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్క్లో తమకు స్థలాలు కేటాయిస్తే వెంటనే పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు టీఎస్ఐఐసీ తగిన ఏర్పాట్లు చేస్తున్నది. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ టాయ్స్, బేబీ ప్రోడక్ట్స్, వుడెన్ ఎడ్యుకేషనల్ ఐటమ్స్ తయారు చేసేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
తద్వారా దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడులు, 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బొమ్మలను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ర్టాలకు ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. తెలంగాణలో బొమ్మల మార్కెట్ రూ.100 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. రాష్ట్రంలో నిర్మల్ చెక్క బొమ్మలను కాకుండా ఇతర బొమ్మలను అమ్మే దుకాణాలు 300 వరకూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ దుకాణదారులంతా నోయిడా, ముంబై, కర్ణాటక తదితర ప్రాంతాలనుంచి బొమ్మలను దిగుమతి చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బొమ్మల తయా రీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా దండుమల్కాపూర్లో ఎంఎస్ఎంఈ పార్క్కు సమీపంలో బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు 75 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. బొమ్మల తయారీకి అవసరమైన వస్తువులను పక్కనే ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్లోనూ ఉత్పత్తి చేయవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు దండు మల్కాపూర్ను ఎంపికచేసింది.
ఇతర రాష్ర్టాలకూ ఎగుమతులు
బొమ్మల తయారీ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తున్నది. టాయ్స్ పార్క్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. ఈ పార్క్లో పరిశ్రమలు ఏర్పాటైతే మన రాష్ట్రంలో తక్కువ ధరకే బొమ్మలను అందుబాటులోకి తేవడంతోపాటు సమీప రాష్ర్టాలకూ ఎగుమతి చేయవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి బొమ్మలను దిగుమతి చేసుకోవడంవల్ల రవాణా ఖర్చులు, పన్నులు తడిసి మోపెడవుతున్నాయి. ఇతర రాష్ర్టాలు కూడా బొమ్మల కోసం ఎక్కువగా ఢిల్లీ, ముంబైపైనే ఆధార పడుతున్నాయి.
– జనార్దన్, అధ్యక్షుడు, టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ