ఆలేరు, డిసెంబర్ 11: పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానను సందర్శించి వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ దవాఖానలకు గతానికి భిన్నంగా రోగులు వస్తున్నారని, సాధారణ ప్రసవాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్నదని చెప్పారు. ప్రైవేటు దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను విస్తరింపజేస్తున్నామని పేర్కొన్నారు. ఆలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతుల కోసం రూ.90 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.