కోట్ల మంది ప్రజలు, వేలమంది ఉద్యోగులు దశాబ్దాలపాటు స్వేదం చిందించి నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలన్నీ అడ్డికి పావుశేరు కాడికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే అధికారంలోకి వచ్చామన్నట్టు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న సంస్థలను (ఈఎస్యూ) కూడా తమ అనుంగు అనుచరులైన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నది.
గత ఎనిమిదేండ్లలో వందకుపైగా ప్రభుత్వ సంస్థలను అమ్మేసినా కేంద్రంలోని మోదీ సర్కారు ఆకలి చావలేదు. పీఎస్యూలతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకులు.. చివరకు మారుమూల గ్రామాల్లో పేదలకు సేవలందించే గ్రామీణ బ్యాంకులను కూడా వదలకుండా ప్రైవేటుపరం చేయాలని ప్రణాళికలు వేస్తున్నది. వీటన్నింటితోపాటు పోస్టు డబ్బాను కూడా కార్పొరేట్ శక్తుల కబందహస్తాల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఒకప్పుడు అన్ని రంగాల్లో విస్తరించిన ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ), ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇప్పుడు ఆనవాళ్లే లేకుండాపోయే ప్రమాదంలో పడ్డాయి. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు వీటిని శరవేగంగా ప్రైవేట్పరం చేస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 100కుపైగా సంస్థల్లో వాటాలను విక్రయించింది. మరికొన్ని సంస్థలను మొత్తానికే కార్పొరేట్లకు అప్పగించింది. ఇందులో ఎయిర్ ఇండియా కూడా ఒకటి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్నూ ఇలాగే ప్రైవేట్బాట పట్టించాలని చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 8 ఏండ్లలో రూ.4 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థల వాటాలు ప్రైవేట్ సంస్థల గుప్పిట్లోకి వెళ్లిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అమ్మకానికే ఓ ప్రత్యేక సంస్థ..
ప్రభుత్వ భూముల అమ్మకానికి ఓ స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసేందుకూ కేంద్రం సిద్ధమైంది. మార్చిలో దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా వచ్చింది. ప్రైవేటీకరిస్తున్న, మూతబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలకు చెందిన భవనా లు, మిగులు భూముల నిర్వహణ, అమ్మకానికి ఈ కొత్త కంపెనీని మోదీ సర్కారు తీసుకొస్తున్నది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) పేరుతో వస్తున్న ఈ ఎస్పీవీని రూ.5 వేల కోట్ల ఆరంభ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, రూ.150 కోట్ల పెయిడ్-ఆఫ్ షేర్ క్యాపిటల్తో కేంద్రం ఏర్పాటు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)లు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ఆధ్వర్యంలోని భూములు, భవనాలను స్వాధీనం చేసుకుని ఎన్ఎల్ఎంసీ అమ్ముతుంది.
బలిపీఠంపై తపాలా డబ్బా
దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రభు త్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తున్న మోదీ సర్కారు కన్ను తాజాగా తపాలాశాఖపై కూడా పడింది. ఇండియా పోస్ట్ నిర్వహిస్తున్న కొన్ని కీలక సేవలను కార్పొరేటీకరించాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై సంస్థ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
విక్రయ రోడ్మ్యాప్లో ఉన్న పీఎస్యూలు..
ఐటీసీ, ఐవోసీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా, ఐడీబీఐ, బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్, బొగ్గు గనులు, షిప్పింగ్ కార్పొరేషన్, ఎఫ్ఎస్ఎన్ఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో విక్రయానికి బ్రేక్ పడింది), ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీ (ఈ మూడు సంస్థలను మూసేయడం లేదా పూర్తిగా విక్రయించే ప్రతిపాదనలున్నాయి).