హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కొవిడ్ టీకాల పంపిణీలో రాష్ట్రప్రభుత్వం మరో మైలురాయిని చేరుకొన్నది. బుధవారంతో రాష్ట్రంలో రెండు కోట్ల మందికి టీకాలు పూర్తి చేసింది. కొవిడ్ను సమర్థంగా నిరోధించేందుకు మొత్తం 2.2 కోట్ల మందికి రెండు చొప్పున టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ దిశగా ప్రణాళికలు రూపొందించి వేగంగా అమలుచేస్తున్నది. రెండు కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన సందర్భంగా సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కేక్ కట్ చేశారు. కొన్ని నెలలుగా వాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్న వైద్యారోగ్యం, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలో 52 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకాలు వేయటం పూర్తయిందని చెప్పారు. త్వరలోనే 100 శాతం లక్ష్యం చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నెలాఖరులోగా మరో కోటి డోసులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, డీఎంహెచ్ జీ శ్రీనివాసరావు, సీఎంవో ఓఎస్డీ గంగాధర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ 2.0
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొన్నాళ్లుగా శరవేగంగా సాగుతున్నది. మొదట్లో కేంద్రం నుంచి తగినన్ని టీకాలు సరఫరా కాకపోవడంతో వారానికి రెండుమూడు రోజులు వ్యాక్సినేషన్ నిలిపివేయాల్సి వచ్చింది. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవటంతో టీకాల సరఫరా పెరిగింది. మొదటి కోటి డోసుల పంపిణీకి 165 రోజులు పట్టింది. ఈ ఏడాది జనవరిలో టీకాల పంపిణీ ప్రారంభం కాగా జూన్ 25వ తేదీ నాటికి కోటి డోసులు పూర్తిచేశారు. రెండో కోటి డోసుల పంపిణీని కేవలం 78 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. టీకాలు పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేసింది. ముందుగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండే హైరిస్క్ వర్గాలను గుర్తించి, ప్రత్యేక డ్రైవ్ల ద్వారా వారికి వ్యాక్సిన్లు వేసింది. ఇలా 38 లక్షల మందికి టీకాలు వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్ డ్రైవ్లు, ఇంటింటి తనిఖీ, ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ వాహనాలు ఏర్పాటుచేసి దాదాపు ప్రతి ఒక్కరికీ టీకాలు పంపిణీచేసింది.
హైదరాబాద్లో అందరికీ మొదటి డోసు
హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ): వ్యాక్సినేషన్ డ్రైవ్లో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్లో 18 ఏండ్లు నిండినవారందరికీ తొలిడోసు వేశారు. జిల్లాలో 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్లోని 360 వాడలు, కాలనీల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 175 ప్రత్యేక సంచార వాహనాల ద్వారా ప్రతి ఒక్కరినీ కవర్చేశారు. అర్హులందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆయా కాలనీలు, బస్తీలకు ప్రశంసా పత్రాలను కూడా అందించారు. కాగా, టీకాలు తీసుకున్నవారు వేసుకోని వారికి రాయబారిగా వ్యవహరించి వాక్సినేషన్ను వేగవంతం చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో దీపక్ సప్రా పిలుపునిచ్చారు. బుధవారం మాదాపూర్లోని హైటెక్స్లో ‘కొవిడ్ వాక్సిన్ ఇన్ వరల్డ్’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా రెండోవేవ్తో పోల్చితే మూడో వేవ్ తీవ్రత తక్కువే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ కార్డియాలజిస్ట్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రంగారెడ్డి బుర్రి, సెర్బ్ నేషనల్ సైన్స్ చైర్ ఎం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.