హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాస రావు తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్ తీవ్రత అధికంగా ఉందని వెల్లడించారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మానవ శరీరంపై డెల్టా వైరస్ ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని ఈ రకం వైరస్లో గుర్తించామని పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో 2 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. కరోనా రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితులు బయట తిరగొద్దు. 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కరోనా మూడో దశకు మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది వ్యాక్సినేషన్కు అర్హులు. ఇప్పటివరకు 1.12 కోట్ల మందికి ఓ డోసు వ్యాక్సిన్ ఇచ్చాం. 33.79 లక్షల మందికి రెండు డోసులు వేశాం. కేంద్రం నుంచి అదనంగా 9.5 లక్షల డోసులు వచ్చాయి. ఒకట్రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. కరోనా మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాం. ప్రభుత్వ దవాఖానల్లో 26 వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి.. పిల్లల కోసం జిల్లా దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం’ అని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు.