హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 4,393 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31 వేలు దాటింది. రికవరీ రేటు 95.18 శాతానికి తగ్గింది. మరోవైపు రికవరీలు సైతం రెండువేలు దాటాయి. శనివారం 2,319 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శనివారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,643, మేడ్చల్-మల్కాజిగిరిలో 421, రంగారెడ్డిలో 286, హనుమకొండలో 184, ఖమ్మంలో 128 కేసులు వెలుగు చూశాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2.61 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 57వేల మందికి మొదటిడోస్, 1.92 లక్షల మందికి రెండో డోస్, దాదాపు 11 వేల మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-18 ఏండ్ల వారికి ఇప్పటివరకు 58 శాతం మొదటి డోస్ పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35.65 లక్షల డోసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 53,412 పడకలు అందుబాటులో ఉన్నాయి.