రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దని ఆదేశం
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొదంటూ కేంద్ర జలవనరులశాఖకు ఆర్థికశాఖ స్పష్టంచేసింది. 2017 మార్చి 15న కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు, ఆ మొత్తానికే వ్యయం పరిమితం కావాలని తేల్చి చెప్పింది. కేంద్ర జలవనరులశాఖకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.55,656.87 కోట్ల తుది అంచనా వ్యయంపై స్పందించలేదు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు భరిస్తామని ఆర్థికశాఖ పేర్కొన్నది. అందులో హెడ్వర్క్స్, భూమి, సహాయ పునరావాసానికి నిర్దేశించిన మొత్తాలను దాటి ఇవ్వకూడదని జల్శక్తి నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు రూ.5 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.7,278.85 కోట్లు, హెడ్వర్క్స్కు రూ.8,818.21 కోట్లు, కుడి ప్రధాన కాలువకు రూ.1885.43 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.2,373.07 కోట్లకే పరిమితం కావాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జల్శక్తిశాఖ ఆదేశించింది.