కరోనాకు చిన్నా.. పెద్దా.. తేడాలేదు.. ఏ వయసువారికైనా సోకుతున్నది. తమ శరీరంలో చోటుచేసుకొనే మార్పులను తెలుసుకోలేని చిన్నారులు వైరస్ బారిన పడితే ఎలా? వైద్యసేవలు ఎలా పొందాలి? వైరస్ సోకిన తర్వాత, సోకక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? ఇలా పలు కుటుంబాల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. పిల్లలకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్ బారిన పడితే అందించే చికిత్స వంటి వివరాలను నిలోఫర్ దవాఖాన డిప్యూటీ సివిల్ సర్జన్, చిన్నపిల్లల వైద్యుడు లాలూప్రసాద్ వెల్లడించారు. చిన్నపిల్లల్లో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లో నెలకొన్న ఇతర సందేహాలపై ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
రెండో దశ కరోనా వ్యాప్తి చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం కనిపిస్తున్నది. గతేడాది మొదటి దశ కేసుల్లో చిన్నపిల్లలకు 0.5 నుంచి ఒక శాతమే వచ్చింది. ప్రస్తుత కేసుల్లో చిన్నపిల్లలు 2.5% వరకు వైరస్బారిన పడినట్టు అంచనాలున్నాయి. కరోనా లక్షణాల్లో నాలుగు వ్యత్యాసాలున్నాయి. ఇందులో సాధారణ (మైల్డ్) జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలుంటే వైద్యుని సలహా తీసుకొని తగిన మందులు వాడితే తగ్గుతుంది. తదుపరి జ్వరం రాకుంటే ప్రమాదం ఉండదు. మైల్డ్ దశలో మందులు వాడినా ఫలితం లేకపోవడం, తరచూ జ్వరం రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటే అది మోడరేట్. ఈ దశలో ఉన్నవారి పరిస్థితిని బట్టి కరోనా పాజిటివ్గా నమోదైనప్పటికీ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచి వైద్యుడు సూచించిన మందులు వాడేలా చూడాలి. ఇతర వ్యాధులున్న చిన్నారులకు కరోనా సోకితే ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోయి 90కి తక్కువ ఆక్సిజన్ లెవెల్స్తో సివియర్, క్రిటికల్ దశ కనపడితే.. వారిని తక్షణం దవాఖానకు తరలించి చికిత్స అందించాలి.
సాధారణ జ్వర లక్షణాలుంటే వైద్యుని సలహా తీసుకుని మందులు వాడాలి. 5 ఏండ్లలోపు పిల్లలను అనవసరంగా బయటకు తీసుకెళ్తే ఇతర వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అందుకే వైద్యుని సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి. వ్యాధి తీవ్రత పెరిగి డొక్కలు ఎగిరేయడం, శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటం వంటివి కనిపిస్తే కరోనా పరీక్షలను చేయించి పాజిటివ్ వస్తే దవాఖానలో చేర్చాలి. కొవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా చిన్నారులు వేగంగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోమాకు వెళ్లే దశలో ఉన్నవారు మాత్రమే మృత్యువాత పడుతున్నారు. కరోనా సోకిన పెద్దవారితో పోల్చితే పిల్లల్లో మరణాల శాతం తక్కువగా నమోదైంది.
కరోనా సోకి సివియర్, క్రిటికల్ దశలో ఉన్న పిల్లలకు మాత్రమే వైద్య చికిత్స అందిస్తారు. పాజిటివ్ వచ్చిన పెద్దవారికి వినియోగించినట్టు హైడోస్ మందులు చిన్నపిల్లలకు ఇవ్వరు. ఐదేండ్లలోపు పిల్లలకు సిరప్ల రూపంలోనే మందులిస్తారు. తరచూ ఫ్లూయిడ్స్, జ్వరం కంట్రోల్లో ఉండేలా మందులు అందిస్తారు. కరోనా వల్ల పెద్ద వయసువారిలో కొందరికి లంగ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో అది ఎక్కడా రాలేదు. పిల్లల్లో ఊపిరితిత్తులపై కన్నా వ్యాధి తీవ్రత ఉన్నవారికి గుండెపై ప్రభావం చూపినట్టు పరిశోధనల్లో తేలింది. పెద్దవయసువారికన్నా 16 ఏండ్లలోపు పిల్లలు వేగంగా కోలుకున్నట్టు గుర్తించాం.
పాజిటివ్వారికే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా చిన్నపిల్లల వైద్యానికి అధిక మొత్తంలో ఖర్చుచేస్తున్నది. పిల్లల్లో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాల్లో ప్లాస్మా దెబ్బతిన్నవారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాలను అవలంబిస్తున్నది. శ్వాస సమస్య ఎదుర్కొనే చిన్నారుల కోసం ఆక్సిజన్ అందుబాటులో ఉంచేలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. వైరస్ సోకిన చిన్నారులకు నిలోఫర్, గాంధీ దవాఖానలో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు.
పిల్లలను అవసరమైతే తప్ప బయటకు తీసుకెళ్లకూడదు. అన్ని రకాలుగా రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ పిల్లలకు వైరస్ ఎలా సోకిందో గుర్తించాలి. కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్ నమోదైతే పిల్లలను దూరంగా ఉంచాలి. వారిలో జ్వరం పెరగకుండా చూసుకోవాలి. లక్షణాలుంటే ఇంట్లో ఉంచి మందులు వాడుతూనే డీహైడ్రేషన్కు గురికాకుండా చూడాలి. ప్రత్యేక గదిలో ఉంచి ఎప్పటికప్పుడు జ్యూస్లు అందించాలి. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు చేయాలి. పారాసెటమాల్ హైడోస్ మందులు వాడొద్దు. వైద్యుని సలహా తీసుకుని మందులు వాడాలి. ఐదేండ్లలోపు పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల చేతులను తరచూ సోప్, వాటర్తో కడగాలి. శానిటైజర్తో కడగక పోవడమే మంచిది.