ఆదిలాబాద్ జిల్లా పొన్నాల, బోథ్ గ్రామాల్లో 20కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రామ పెద్దలు అప్రమత్తమయ్యారు. పదిరోజులపాటు కర్ఫ్యూ ఉంటుందని తీర్మానించారు. రెండు గ్రామాల్లో సాయంత్రం ఐదుగంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నారు. రిటైల్ దుకాణాలు, ఇతర షాప్లను ఐదుగంటలకే మూసేస్తున్నారు. ప్రజలు బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రం అనుమతిస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా గవిచర్ల గ్రామంలో 17 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అప్రమత్తమైన సర్పంచి, ఊరి పెద్దలు గ్రామంలో 23వ తేదీ నుంచి 30 వరకు లాక్డౌన్ విధించారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే ఊరిలోని కిరాణా దుకాణాలు తెరవాలని నిర్ణయించారు. మాస్కు లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా విధిస్తున్నారు. సంగెం మండలం ముండ్రాయి గ్రామంలోనూ లాక్డౌన్ విధించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్లో 27 మందికి పాజిటివ్ వచ్చింది. గ్రామంలో ఏప్రిల్ 15 నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమలుచేస్తున్నారు. గర్మిళ్లపల్లి, ఎడపల్లి గ్రామాలు ఇదే బాటలో లాక్డౌన్ పాటిస్తున్నాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. కరోనా పోరులో వందల గ్రామాలు ఏకమవుతున్నాయి. వైరస్ కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలకు దిగుతున్నాయి. ఏ పల్లెకు ఆ పల్లె లాక్డౌన్, కర్ఫ్యూ, ఇతర నియమాలు పాటిస్తూ కరోనాను ఖతం చేసేందుకు కదులుతున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెలు కరోనాపై సైరన్ మోగించాయి. పాజిటివ్ కేసులకు భయపడకుండా కలిసికట్టు నిర్ణయాలతో ప్రజలను కాపాడుకొనేందుకు ఆరాటపడిపోతున్నాయి. కరోనా రోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటూనే.. మిగిలినవారు వైరస్ బారినపడకుండా రక్షణ చర్యలు చేపడుతున్నాయి. సాయంత్రం వేళ కర్ఫ్యూ, వారం పదిరోజులపాటు లాక్డౌన్ అంటూ వైరస్ను కట్టడిచేసే వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఏప్రిల్ మొదటివారం నుంచి ఇప్పటివరకు వందల గ్రామాలు లాక్డౌన్, కర్ఫ్యూ, మాస్కు లేకుంటే జరిమానా తదితర చర్యలు తీసుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్రూరల్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటివరకు 300కు పైగా గ్రామాలు లాక్డౌన్ లేదా స్వీయ కర్ఫ్యూ అమలుచేస్తున్నాయి.
చాలా గ్రామాల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదుకావడానికి వారం, పదిరోజుల ముందు ఏదో ఒక జాతర, వేడుక జరగడమేనని వైద్యులు చెప్తున్నారు. జగిత్యాలలోని ఎడపల్లిలో 49 పాజిటివ్ కేసులు నమోదువడానికి ముందే ఓ జాతర సాగింది. అందులో పాల్గొన్న చాలా మందికి పాజిటివ్ వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా గవిచర్లలోనూ ఈ నెల తొలివారంలో ఐదురోజుల పండుగ చేశారు. దాదాపు రెండు వేలమంది ఇందులో పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఎక్కువ కేసులు వచ్చాయి. ఇటీవల చాలా గ్రామాల్లో ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వేడుకలు చేసుకోవడం మంచిదికాదని, తప్పనిసరైతే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా గ్రామాలు మాస్కు లేకుండా బయటతిరిగేవారికి రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నాయి. దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నాయి.
రద్దీ ప్రదేశాల్లో, వారపు సంతల్లో జనం గుమిగూడకుండా, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో ఎవరూ కూర్చోకుండా అక్కడున్న బెంచీలను తొలగిస్తున్నాయి.
కరోనా బాధితులను గత వారంరోజులుగా కలిసినవారిని హోం ఐసొలేషన్ చేస్తున్నాయి.
గ్రామాల్లోని పేద కుటుంబాల్లో ఎవరైనా వైరస్ బారినపడితే వారికి యువజన, కుల సంఘాలు చేయూత అందిస్తున్నాయి. ఆహారం, మందుల సరఫరాతోపాటు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నాయి.