హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): కరోనాను ఎదుర్కోవడంలో విటమిన్-డీ కీలకపాత్ర పోషిస్తుందని తెలంగాణ వైద్యబృందం పరిశోధనలో వెల్లడైంది. శరీరంలో విటమిన్-డీ సరైన మోతాదులో ఉంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని ఆ బృందం పేర్కొంది. గాంధీ, నిమ్స్ దవాఖానలకు చెందిన ఈ వైద్య బృందం ఆరు నెలలపాటు శ్రమించి విటమిన్-డీపై అధ్యయనం పూర్తిచేసింది. పల్స్ డీ థెరపీ’ పేరుతో జరిపిన ఈ అధ్యయనం www.natu re.comలో ప్రచురితమైంది. దీని వివరాలను బృందంలో ఒకరైన డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా వివరించారు.
అధ్యయనానికి కారణం ఏంటి?
1917లో స్పానిష్ ఫ్లూ విస్తరించినప్పుడే విటమిన్-డీ ప్రత్యేకత తెలిసొచ్చింది. విటమిన్-డీ శ్వాసకోశ వ్యాధుల నుంచి కాపాడుతుందని పలు ఆధారాలు ఉన్నాయి. అయితే ఎంత మోతాదులో ఇవ్వాలి, దాని ప్రభావం ఎంత అన్నదానిపై స్పష్టత లేదు. శరీరంలో విటమిన్-డీ స్థాయి 40-60 ఎన్జీ/ఎంఎల్ (నానోగ్రాం పర్ మిల్లీలీటర్) మధ్యలో ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. కొవిడ్ వచ్చిన వారికి 80-100 ఎన్జీ/ఎంఎల్ మధ్యలో ఉంటే ఆటో ఇమ్యూనిటీ ఏర్పడుతుందని మరో అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో నిమ్స్, గాంధీ దవాఖానల వైద్య బృందం తాజా అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
ఫలించిన విటమిన్ ప్లాన్
ఈ బృందం నిమ్స్, గాంధీ దవాఖానల్లో 130 మంది రోగులను విటమిన్-డీ, నాన్ విటమిన్-డీ గ్రూప్లుగా విభజించి పరిశోధన జరిపింది. విటమిన్-డీ గ్రూప్ వారికి వారి బీఎంఐ ఆధారంగా 8 నుంచి 10 రోజులు రోజుకు ఒక విటమిన్-డీ (60,000 ఐయూ) గోళీలను అందించారు. నాన్ విటమిన్ గ్రూప్ వారికి ఎలాంటి గోళీలు ఇవ్వలేదు. అనంతరం ఈ రెండు గ్రూపుల వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఎన్ఎల్ రేషియో, సీఆర్పీ, ఎల్డీహెచ్, ఐఎల్-6, ఫెరిటిన్, డీ-డైమర్ వంటి పరీక్షలను (ఇన్ఫ్లమేటరీ మార్కర్స్) ఇరు వర్గాల్లో నిర్వహించారు. విటమిన్-డీ అందించిన వారిలో మెరుగైన ఫలితాలు రాగా, అందించని వారిలో వ్యాధి తీవ్రత పెరిగింది. ఈ అధ్యయన సమయంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాల ఆధారంగా కరోనా చికిత్సకు విటమిన్-డీ ఎంతో ఉపకరిస్తుందని వైద్య బృందం నిర్ధారణకు వచ్చింది.
ఎవరు ఎంత వాడాలి?
చికిత్స పొందేవారికి వరుసగా 8 రోజులు, వైరస్ సోకనివారు 4 రోజులు తీసుకుంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని వైద్య బృందం తెలిపింది. శరీరంలో విటమిన్-డీ 60 స్థాయిలో ఉంటే కరోనా వచ్చేందుకు 5%, 30 కంటే తక్కు వ ఉంటే 15 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే విటమిన్ డీ స్థాయి 60గా ఉండాలంటే ఎంత బరువున్న వారికి ఎంత డోస్ ఇవ్వాలన్న దానిపై గతంలో నిమ్స్ జరిపిన అధ్యయనం ఉపయోగపడింది.
వరుసగా నాలుగు రోజులు.. ఆ తర్వాత నెలకు ఒకటి
విటమిన్-డీని 18 ఏండ్లు దాటిన వారు వినియోగించవచ్చని చెప్తున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారు సహా అందరూ వాడవచ్చని, అయితే కిడ్నీలో రాళ్లున్నవారు మాత్రం పరీక్ష అనంతరం వినియోగించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. రోజుకు ఒక విటమిన్-డీ (60,000 ఐయూ) చొప్పున నాలుగు రోజుల పాటు తీసుకొని, ఆ తర్వాత నెలకు ఒక విటమిన్-డీ తీసుకోవాలి. అప్పుడు శరీరంలో విటమిన్-డీ 60 ఎన్జీ/ఎంఎల్ స్థాయికి వస్తుంది. దీన్ని ఇలాగే మెయిన్ టెయిన్ చేయాలి.
అధ్యయనం బృందంలోని వైద్యులు
డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి
డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గడిగ
డాక్టర్ ఆర్డీ మాలతి
డాక్టర్ మధులత కర్ర
డాక్టర్ ఐఎస్ఎస్వీ ప్రసాద్ మూర్తి రాజు
డాక్టర్ రాగిణి
డాక్టర్ సంగీత చినపాక
డాక్టర్ కేఎస్ఎస్ సాయిబాబా
డాక్టర్ కే మనోహర్
కరోనాకు విటమిన్-డీ విరుగుడు
విటమిన్-డీ మోతాదు ప్రకా రం తీసుకోవడం వల్ల కరోనా నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే థర్డ్వేవ్ను అడ్డుకోవచ్చు. మైల్డ్గా ఉన్న కేసులను మోడరేట్, సివియర్ కాకుండా ఆపుతున్నాం కాబట్టి బ్లాక్ ఫంగస్ కేసులు సైతం నమోదు కావు. విటమిన్-డీ ఆహారం ద్వారా లభించదు, సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వరుసగా నాలుగు రోజులు, ఆ తర్వాత నెలకు ఒకటి.. ఇలా కరోనా తగ్గుముఖం పట్టే వరకు విటమిన్-డీ వాడొచ్చు. 100ఎన్జీ/ఎంఎల్ దాటితేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉం టాయి. దీనిపై మల్టిపుల్ సెంటర్స్లో అధ్యయనం జరపాలని ఐసీఎంఆర్ సూచించింది. ఇందుకు సన్నద్ధమవుతున్నాం.