రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
హైదరాబాద్లో 315 మందికి సోకిన కరోనా
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదు వందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి చేరింది. హైదరాబాద్ జిల్లాలో కేసుల సంఖ్య 300 దాటింది. గురువారం నమోదైన కేసుల్లో 90 శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది.
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 315, రంగారెడ్డిలో 102, మేడ్చల్ మల్కాజిగిరిలో 31, సంగారెడ్డిలో 11 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం వంటి కొవిడ్ జాగ్రత్తలను తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.