Koratala Siva | హైదరాబాద్, డిసెంబర్ 8, (నమస్తే తెలంగాణ): శ్రీమంతుడు సినిమా కాపీ రైట్స్ వ్యవహారంపై దాఖలైన కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫోర్జరీ, మోసం అభియోగాలకు ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. వీటిపై కేసు కొనసాగింపు చెల్లదని చెప్పింది. దర్శకుడు, రచయిత కాపీరైట్ ఉల్లంఘన కేసు విచారణను ఎదుర్కోవాలని న్యాయమూర్తి జస్టిస్ కే సురేందర్ తీర్పు చెప్పారు. ఎనిమిది మంది రచయితల కమిటీ నవల కాపీ అని తేల్చిందని గుర్తు చేశారు. అంతమాత్రాన అది మోసం, ఫోర్జరీ కిందికి రాదని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి చిత్రాన్ని నిర్మించడంతోపాటు, కథ, రచన, స్క్రీన్ప్లేకు కూడా దర్శకుడే సొమ్ము చెల్లించినందున ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు. నిర్మాతలపై కేసును కొనసాగించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఎర్నేని నవీన్, మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్పై ఉన్న కేసులను కూడా కొట్టివేశారు.
‘చచ్చేంత ప్రేమ’ నవలా రచయిత ఫిర్యాదు
చచ్చేంత ప్రేమ.. పేరిట తాను రాసిన నవలను శ్రీమంతుడు పేరుతో సినిమాను చిత్రీకరించి, కథ, రచయితగా మరొకరిని పేరొనడంపై దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు ఎర్నేని రవి, మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్పై రచయిత శరత్ చంద్ర అలియాస్ ఆర్డీ విల్సన్ క్రిమినల్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టేయాలని వారంతా వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే సమయంలో వారిపై ఫోర్జరీ, చీటింగ్ కేసుల నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలని శరత్చంద్ర పిటిషన్ వేశారు. వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారించింది. ప్రధాన కథలో కొద్దిగా మార్పులు చేసి సినిమా తీసి సొంత కథ అని చెప్పడానికి వీళ్లేదని న్యాయమూర్తి చెప్పారు. రచయితల కమిటీ నిర్ణయం ప్రకారం కూడా ఇది కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని తీర్పులో స్పష్టం చేశారు. నిర్మాతపై కేసును మాత్రం కొట్టివేశారు. అదేవిధంగా ఫోర్జరీ, మోసం కూడా అవుతుందన్న విల్సన్ పిటిషన్నూ కొట్టేశారు. దర్శకుడు కాపీ రైట్స్ యాక్ట్ కింద విచారణను ఎదుర్కోక తప్పదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.