హిమాయత్నగర్, అక్టోబర్ 1:నిబంధనల ప్రకారం మత్స్యకారులుగా కొనసాగుతున్న వివిధ సామాజికవర్గాల మధ్య సమన్వయం పెంచేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ కృషి చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని మహాసభ రాష్ట్ర కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యవృత్తిపై ఆధారపడిన వారందరికీ సభ్యత్వాలు ఇవ్వాలని కమిటీకి సూచించారు. నూతన మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న గ్రామ పంచాయతీ తీర్మానాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్ముదిరాజ్, ప్రభుత్వ సలహాదారు పిట్టల రవీందర్, సమన్వయ కమిటీ సభ్యులు గొడుగు శ్రీనివాస్, బాలరంగం, బుస్సా మల్లేశం, బల్ల సత్తయ్య, హరినాథ్, బొజ్జ నారాయణ, అల్లుడు జగన్, బొక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.