న్యూఢిల్లీ, మే 7: పెట్రోల్, నిత్యావసరాల ధరల మంటతో ఇప్పటికే హడలెత్తిపోతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ. 50ను వడ్డించింది. తాజా ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. తాజా పెంపుతో హైదరాబాద్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1,052కి చేరింది. ఆరువారాల వ్యవధిలో 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్పై ధరలు పెంచడం ఇది రెండోసారి. మార్చి 22న సిలిండర్పై రూ. 50 పెంచారు.
ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్పై ఏకంగా రూ. 102.50 పెంచిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ ధర రికార్డుస్థాయిలో రూ. 2,562.5కు చేరింది. ఎల్పీజీ ధరలను పెంచడంపై విపక్షాలు మండిపడ్డాయి. చమురు ధరలను తరచూ పెంచుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజలను పీడిస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలను, దేశాన్ని లూటీ చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అచ్చేదిన్ మళ్లీ తెచ్చినందుకు ధన్యవాదాలంటూ కేటీఆర్ వ్యంగంగా ట్వీట్ చేశారు.