హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో మరీ విశృంఖలరీతిలో వ్యాప్తిచెందే తప్పు డు కథనాలు, సమాచారం, రెచ్చగొట్టే వార్తలను నిలువరించలేమా? డిజిటల్ మీడియాలో వచ్చే సమాచార మూలాలను పసిగట్టలేమా? జనాలను తప్పుదోవ పట్టించే వార్తల సృష్టికర్తలను చట్టాలేవి చేయలేవా? అంటే.. డిజిటల్ మీడియాపై కనీస పరిజ్ఞానం ఉంటే సాధ్యమేనని అంటున్నారు టెక్ నిపుణులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ పోలీస్, ఎండ్ నౌ ఫౌండేషన్, ఎస్సీఎస్సీ, టీపీఎస్సీసీ సంస్థల ఆధ్వర్యంలో శనివారం ‘ఆధునిక యుగంలో డిజిటల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు.
డిజిటల్ మీడియాలో తప్పుడు వార్తలను గుర్తించేందుకు టెక్నలాజికల్ టూల్స్ ఉన్నాయని ఎండ్ నౌ ఫౌండేషన్ సీఈవో అనిల్ రాచమల్ల, ఫ్యాక్ట్లీ సంస్థ ఫౌండర్ రాకేశ్ దుబ్బుడు తెలిపారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు పీఏఆర్ఐ విధానం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఫ్యాక్ట్ చెక్, రివర్స్ ఇమేజ్, వీడియో అనాలసిస్, వెబ్ ఆర్కైవ్స్వంటి టెక్నాలజీ టూల్స్ ద్వారా వాస్తవాలను క్రాస్ చెక్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో పౌరులు స్వేచ్ఛా హక్కు కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు అడ్వొకేట్, సైబర్ లా నిపుణుడు సాయితేజ కావేటి తెలిపారు. సిటిజన్ జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.