హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ఆదివాసీ, గిరిజనులకు గొప్ప వరంగా మారింది. వారి కుటుంబాల్లో కల్యాణ కాంతులు నింపడంతోపాటు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నది. ఆదివాసీ, గిరిజన యువతుల్లో అక్షరాస్యతను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. మైదాన ప్రాంత గిరిజనుల్లో ఆడపిల్లలకు పెండ్లి చేయలేక మానవ అక్రమ రవాణా లాంటి అసాంఘిక వ్యవహారాలకు గురయ్యే దుస్థితిని నిర్మూలించడంలో ఈ పథకం ముఖ్య భూమిక పోషిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఎస్సీ, ఎస్టీల కుటుంబాల్లోని ఆడబిడ్డల పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ 2014 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. తొలుత రూ.51 వేలుగా ఉన్న కల్యాణలక్ష్మి సాయాన్ని ప్రభుత్వం 2017లో రూ.75 వేలకు, 2018 మార్చిలో రూ.1,00,116కు పెంచడంతోపాటు బీసీ, మైనారిటీ వర్గాలకూ ఈ పథకాన్ని విస్తరించింది. ఈ పథకం అమలుతో సమాజంలో వచ్చిన మార్పులు, ప్రత్యేకించి గిరిజనులకు కలిగిన ప్రయోజనంపై కాకతీయ యూనివర్సిటీ (కేయూ) సోషల్ వర్క్ విభాగంతో రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధన శిక్షణా సంస్థ శాస్త్రీయంగా అధ్యయనం చేయించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
అధ్యయనం ఎక్కడ చేశారు?
ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏ ప్రాంతాలతోపాటు నల్లగొండ, వరంగల్ మైదాన ప్రాంతాల్లోని 10 జిల్లాలు, 21 మండలాలు 82 గ్రామాల్లో కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధి పొందిన 202 కుటుంబాలపై అధ్యయనం నిర్వహించారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని కూసుమంచి, వాజేడు.. ఏటూరునాగారం పరిధిలోని బయ్యారం, గూడూరు, మహబూబాబాద్, కురవి.. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని బల్మూరు, లింగాల.. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, ఉట్నూరు.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నేరెడుగొమ్ము, త్రిపురారం.. హనుమకొండ జిల్లాలోని దామెర.. వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట, గీసుగొండ, ఖానాపూర్, పర్వతగిరి, రాయపర్తి, సంగెం మండలాల్లో ఈ అధ్యయనం జరిగింది. 38 ప్రశ్నలతో కల్యాణలక్ష్మి లబ్ధిదారుల కుటుంబ నేపథ్యం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, విద్యార్హతలు తదితర వివరాలను సేకరించి వాటి ఆధారంగా వారి స్థితిగతులను విశ్లేషించారు.
అధ్యయనంలో వెల్లడైన వివరాలు
కల్యాణలక్ష్మితో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కామని అనేకమంది లబ్ధిదారులు తెలిపారు.
ఈ పథకంతో పెండ్లి ఖర్చులన్నీ తీరిపోయాయని 85% మంది లబ్ధిదారులు చెప్పారు.
ప్రభుత్వ సాయం చాలలేదని కేవలం 15% మంది పేర్కొన్నారు.
పెండ్లి పూర్తయిన చాలా రోజులకు కల్యాణలక్ష్మి సాయం అందుతున్నదని, వివాహం నిశ్చయమైన వెంటనే ప్రభుత్వ సాయం అందేలా చూస్తే ఈ పథకం మరింత ఉపయుక్తంగా ఉంటుందని పలువురు లబ్ధిదారులు తెలిపారు.
కల్యాణలక్ష్మితో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గినట్టు ఈ అధ్యయనం తేల్చింది.
ఈ పథకంతో మంచి వరుడిని ఎంపిక చేసుకునే అవకాశం కలిగిందని 47% మంది లబ్ధిదారులు పేర్కొన్నారు.
చదువులు పూర్తయ్యాకే పెండ్లి చేసుకోవాలని భావించామని, కల్యాణలక్ష్మితో ఆ కోరిక తీరిందని 53% మంది చెప్పారు.
కొలాం, థోటీ, గోండు, చెంచు తదితర ఆదివాసీ గిరిజన తెగల్లో వరకట్న సంప్రదాయం లేదని ఈ అధ్యయనం తేల్చింది.
లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులు
కల్యాణలక్ష్మి లబ్ధిదారుల్లో రూ.50 వేలలోపు వార్షికాదాయం కలిగినవారు 52% మంది.
రూ.50 వేల నుంచి రూ.1 లక్ష.వార్షికాదాయం కలిగినవారు 32% మంది.
16 శాతం కుటుంబాల వార్షికాదాయం రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు.
కొలాం గిరిజన తెగకు చెందిన కుటుంబాల ఆదాయం మిగిలిన తెగల కంటే తక్కువగా ఉన్నట్టు తేలింది. వారి వార్షికాదాయం రూ.50 వేలలోపే ఉన్నట్టు వెల్లడైంది.
లబ్ధిదారుల విద్యార్హతలు
నిరక్షరాస్యులు: 10% మంది
ప్రాథమిక, ప్రాథమికోన్నత
విద్యనభ్యసించినవారు: 19% మంది
ఇంటర్ చదివినవారు: 24% మంది
వృత్తివిద్య (బీఎస్సీ నర్సింగ్, బీఈడీ,
టీటీసీ, డిప్లొమా) కోర్సులు చేసినవారు 10% మంది
గ్రాడ్యుయేట్లు: 26% మంది
బీటెక్, బీఫార్మసీ చేసినవారు: 7% మంది
పోస్ట్ గ్రాడ్యుయేట్లు: 4% మంది
లబ్ధిదారుల కుటుంబాలకు ఉన్న వ్యవసాయ భూమి
భూమిలేని వారు: 20% మంది
ఎకరం కంటే తక్కువ ఉన్నవారు: 19% మంది
ఎకరం నుంచి 2 ఎకరాలున్నవారు: 38% మంది
2 నుంచి 5 ఎకరాలున్నవారు: 19% మంది
5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు: 4% మంది