Komuravelli Mallanna | చేర్యాల, ఏప్రిల్ 7: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానానికి నిత్యావసర వస్తువుల సరఫరాలో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం టెండర్లలో కోట్ చేసిన విధంగా సరుకులు పంపిణీ చేయకుండా ఏటా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు స్వామివారికి శఠగోపం పెడుతున్నారు.
నాణ్యమైన వస్తువులు సరఫరా చేస్తామని టెండర్లు దక్కించుకుని.. నాసిరకం వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు.. నాసిరకం వస్తువులకు కూడా మార్కెట్ ధరల కంటే రెట్టింపు రేట్లు వసూలు చేస్తూ దేవస్థానం సొమ్మును లూటీ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ బడా కాంట్రాక్టర్.. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో కుమ్మక్కై.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నింటినీ తన గుప్పిట పట్టుకుని ఇలా మోసానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాసిరకం సరుకుల సరఫరాను అరికట్టాల్సిన దేవాదాయశాఖ విజిలెన్స్, ఇతర శాఖలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శలొస్తున్నాయి. కొమురవెల్లి ఆలయానికి పంపిణీ చేసే వస్తువుల హక్కుల టెండర్లను ఆ బడా వ్యాపారికి చెందిన మూడు సంస్థలు 20 ఏండ్లుగా దక్కించుకుంటున్నాయి.
తాజాగా 2024-25 సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక దేవాదాయశాఖ కమిషనర్ టెండరు ఖరారు చేస్తే.. మునుపటిలాగే టెండరుదారుడు మార్కెట్ కంటే రెట్టింపు ధరలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే అవకాశం ఉందని, సంబంధిత శాఖ అధికారులు మార్కెట్ ధరల మేరకు సరుకులు సరఫరా చేసే వారికి టెండరు అప్పగించాలని భక్తులు కోరుతున్నారు.
ఆలయానికి నిత్యావసరాలు ఎందుకు?
స్వామివారి బ్రహ్మోత్సవాలతోపాటు మిగిలిన రోజుల్లో లడ్డూ, పులిహోర, నిత్యాన్నదానం, స్వామివారికి నిత్యనివేదన, వీఐపీలు, భక్తులకు అన్నదానం తదితర వాటి కోసం ఏటా ఆలయానికి నిత్యావసర వస్తువులు అవసరం అవుతాయి. ఆలయ అధికారులు వస్తువులను నేరుగా కొనుగోలు చేయకుండా, సరుకులు కొనేందుకు ఆన్లైన్లో టెండర్లను పిలుస్తారు. తక్కువ ధరలకు సరుకులను పంపిణీ చేస్తామని పలు వ్యాపార సంస్థలు, ట్రేడర్స్ వారు ధరలను కోట్ చేసి ఆన్లైన్లో టెండర్ దాఖలు చేస్తారు. పంపిణీదారులు ‘ఏపీసీ మరియు హెచ్ఆర్ఐ ఎండోమెంట్స్ ఆక్ట్ 30/87’ ప్రకారం.. నిబంధనలకు లోబడి సరుకులు పంపిణీ చేయాలి.
ఆలయ అధికారులు ఆన్లైన్లో దాఖలు చేసిన టెండర్లను తెరిచి అందులో తక్కువ ధరలకు, ఆలయం పార్మాట్లో ఎవరైతే సరుకులు సరఫరా చేసేందుకు ముందుకు వస్తారో.. వారికే ఏడాదిపాటు టెండరు హక్కులను అప్పగిస్తారు. కొమురవెల్లికి సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల తదితర పట్టణ కేంద్రాలు దగ్గరగా ఉన్నప్పటికీ.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సంస్థ యాజమాన్యం దేవాదాయశాఖలో కొందరు అధికారులతో కుమ్మక్కై.. టెండరు తమకు అనుకూలంగా వచ్చే విధంగా కఠినమైన నిబంధనలను తయారు చేయించి స్థానికులు టెండర్లలో పాల్గొనకుండా చేస్తున్నారు.
దీంతో సమీపంలో ఉన్న వ్యాపారులు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు సరఫరా చేసేందుకు ముందుకొచ్చినప్పటికీ.. కఠినమైన నిబంధనలు వారిని ఆన్లైన్ టెండర్లో పాల్గొనకుండా చేస్తున్నాయి. అయితే.. ఆన్లైన్లో హక్కులు పొందిన సంస్థ లేదా ట్రేడర్స్ వారు ఆలయవర్గాలు తెలిపిన తేదీ నుంచి సంవత్సరంపాటు పార్మాట్ ప్రకారం ఐఎస్ఐ, బ్రాండెండ్ వస్తువులను సరఫరా చేయాలి. సంస్థ నుంచి ఆలయానికి సరఫరా చేసిన సరుకులను అధికారులు లేదా సెక్షన్ ఇన్చార్జి వాటిని పరిశీలించి సెంట్రల్ స్టోర్లో భద్రపరిచి రికార్డులో నమోదు చేసిన అనంతరం పంపిణీ దారులకు ఆలయం నుంచి బిల్లులు చెల్లిస్తారు. సంవత్సరం పాటు సరఫరా చేసే వస్తువులలో కేవలం బ్రహ్మోత్సవాల కాలంలోనే మూడో వంతు వినియోగిస్తారు. ఇదేఅదనుగా భావించి పంపిణీ దారులు నాసిరకం వస్తువులను సరఫరా చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు.
ఆలయ ఫార్మాట్ ఒకటి.. సరఫరా చేసేది మరోటి
ఆలయ అధికారులు ఆలయానికి నిత్యం కావాల్సిన సరుకులను పంపిణి చేసేందుకు ఓ పార్మాట్ తయారు చేసి, సదరు ప్రతిని పంపిణీ దారులకు అందిస్తారు. కానీ.. పార్మాట్ ప్రకారం సరుకులు పంపిణీ కావడం లేదు. ఆలయానికి దాదాపు 52 నిత్యావసర వస్తువులు, కవర్లు పంపిణీ చేయాలి.
వాటిలో ముఖ్యంగా సోనామసూరి బియ్యం, మొదటి రకం పప్పులు, నెయ్యి, పంచదార, శెనగపిండి, స్వస్తిక్ కంపెనీ కారంపొడి, పసుపు, కాజు పలుకులు, పల్లి, ఇలాచి, లవంగాలు, గోల్డ్డ్రాప్ కంపెనీ డాల్డ, అన్నపూర్ణ కంపెనీకి చెందిన ఉప్పు ప్యాకెట్లు, నిర్మా కంపెనీకి చెందిన సర్ఫ్, రెడ్ లేబల్ కంపెనీకి చెందిన చాయ్పత్తా, కాఫీ పౌడర్, ఉప్మారవ్వ, అటుకులు, జాజికాయ, మిశ్రి తదితర వాటిని సరఫరా చేయాలని ఫార్మాట్లో పేర్కొన్నారు. పంపిణీ దారులు మాత్రం ఫార్మాట్ను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నాసిరకం నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నారు. సోనామసూరి కంపెనీ బియ్యానికి బదులు స్ట్రీమ్డ్ రైస్ను, మొదటి రకం పప్పులకు బదులుగా నాసిరకం పప్పులు, ఇతర వస్తువులను అందజేస్తున్నారు.
మార్కెట్ ధరలకే టెండరు ఖరారు
దేవాదాయశాఖ నిబంధనల మేరకు ఆన్లైన్లో టెండరు పొందిన వారే ఆలయానికి నిత్యావసర సరుకులు సనఫరా చేస్తున్నారు. ఈ సంవత్సరం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. దేవాదాయశాఖ నుంచి అప్రూవల్ తీసుకోలేదు. మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో సమీపంలో ఉన్న రత్నదీప్, రిలయన్స్ స్టోర్లను సంప్రదించి తెలుసుకుంటాం. అనంతరం టెండర్లపై నిర్ణయం తీసుకుంటాం.
– ఏ బాలాజీ, ఆలయ ఈవో