ఎల్కతుర్తి, జనవరి 11: కూతురు పట్టించుకోక అనాథగా వదిలేసిన వృద్ధురాలి పట్ల ఎల్కతుర్తి పోలీసులు ఔదార్యం చూపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లో వృద్ధురాలు గొర్రె మార్తకి గృహాన్ని నిర్మించారు. బుధవారం అట్టహాసంగా ఆమెను గృహ ప్రవేశం చేయించారు. అంతేకాదు ఆ వృద్ధురాలి పేరు మీద డిపాజిట్ చేసిన రూ.1.50 లక్షల బాండ్ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ అశోక్కుమార్ మాట్లాడుతూ వృద్ధురాలిని కన్న పిల్లలు పట్టించుకోకపోతే తామే ఆమె పిల్లలుగా చేరదీశామని చెప్పారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ వృద్ధురాలు ఉండటానికి ఓ ఇంటిని నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె బాగోగులు కూడా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఏసీపీ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారని కితాబు ఇచ్చారు. ఈ విషయంలో ఎల్కతుర్తి పోలీసులను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసిన వారికి డీసీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.