ఎటాహ్ (ఉత్తర్ప్రదేశ్): అది ఉత్తర్ప్రదేశ్ ఇటావా ప్రాంతంలోని దుర్గామాతా ఆలయం. అక్కడకు వస్తున్న భక్తులంతా అమ్మవారి దర్శనం సమయంలో ఆశ్చర్యానికి గురవుతున్నారు. దుర్గామాత విగ్రహం ఫొటోలు తీసుకుంటున్నారు. ఇవి సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుర్గామాత విగ్రహానికి మాస్కు ఉండటమే దీనికి కారణం. దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను మాస్కు ధరించేలా చైతన్యపరిచేందుకు ఓ అడుగు ముందుకేశారు ఆ ఆలయ పూజారి పండిట్ మనోజ్శర్మ. చైత్రనవరాత్రుల్లో రెండోరోజయిన బుధవారం విగ్రహ రూపంలోని దుర్గామాతాకు మాస్కు ఏర్పాటుచేశారు. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదంగా మాస్కులను బహూకరించారు. గుడిలో శానిటైటజర్లను ఏర్పాటుచేయడంతోపాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.