(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) భారీ ఖర్చుతో నిర్మించనున్న 12 గోదాముల్లో ఒక్కటీ దక్షిణాది రాష్ర్టాలవి లేకపోవటమే ఇందుకు నిదర్శనం. తొలి విడతలో ఎంపిక చేసిన 9 రాష్ర్టాలూ ఉత్తరాదివే. అందులోనూ 6 బీజేపీ పాలిత రాష్ర్టాలే. మొత్తం మూడు విడతల్లో 249 చోట్ల 111.125 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంలను ని ర్మించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఇందుకు రూ.9,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచ నా వేసింది. వీటిని డీబీఎఫ్వోటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో నిర్మించే బాధ్యతలను ప్రైవేట్కు అప్పగించాలని నిర్ణయించింది. అయితే, ఆహార ధాన్యాల నిల్వ భద్రత, నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ప్రైవేట్కు అప్పగించటం ఎంత వరకు సబబో కేంద్రం పట్టించుకోక పోవటం గమనార్హం.
గోదాంల నిర్మాణానికి ఆగస్టు 10న టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 31న టెండర్ బాక్సులను తెరిచి కాంట్రాక్టులను ఖరారు చేయాల్సి ఉన్నది. మొదటి దశలో నిర్మించే ఒక ప్రాజెక్టు టెండర్ను ఇప్పటికే ఖరారు చేసి ఓ నిర్మాణ సంస్థకు అప్పగించింది. అయితే, ఇక్కడో మెలిక ఉన్నది. భూ సేకరణ వ్యయాన్ని ఎఫ్సీఐనే భరించాలి. ప్రైవేట్ సంస్థలు నిర్మాణాలు చేపట్టి, నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. ఈ నిర్ణయంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కారు ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు
తొలి దశలో ఎంపిక చేసిన 9 రాష్ర్టాల్లో ఆరు బీజేపీ పాలిత రాష్ర్టాలే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ర్టాలు కాగా జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. తక్కిన మూడు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్. ఇందులో ఒక్కటీ దక్షిణాది రాష్ట్రం లేదు. దీన్నిబట్టే దక్షిణాదిపై బీజేపీ సర్కారు ఎంతటి వివక్ష చూపుతున్నదో అర్థం అవుతున్నది.
దేశంలో పంటల దిగుబడికి తగ్గట్టు నిల్వ చేసే సామర్థ్యం ఎఫ్సీఐకి లేకపోవటం వల్లే రైతులకు గిట్టుబాటు ధర దక్కటం లేదని, ఆహార భద్రతను సాధించలేకపోతున్నామని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. దీనికి కారణం మోదీ సర్కారే. 2014 నుంచి ఇప్పటి వరకు నిర్మించిన గోదాములు చాలా తక్కువ. 2014 లో ఎఫ్సీఐ నిల్వ సామర్థ్యం 748.08 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, అది 2022 నాటికి 788.42 మెట్రిక్ టన్నులకు మాత్రమే చేరింది.