ప్రజాకాంక్షల మేరకు ఉండాలి
జ్ఞానం, లోకజ్ఞానం లేని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి
వరంగల్, ఫిబ్రవరి 2: ‘రాజ్యాంగం జడ పదార్థం కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. రాజ్యాంగాన్ని మార్చాలని అనడంతో తప్పేముంది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణలు చేశారని గుర్తుచేశారు. వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆయన వరంగల్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం జోలికి వస్తే ముక్కలు ముక్కలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్కు బహిరంగలేఖ రాసిన పీసీసీ అధ్యక్షుడు రేంవత్రెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జ్ఞానం ఉన్నోడికి చెప్పొచ్చు, లేనివారికి కనువిప్పు కలిగించవచ్చు.. అజ్ఞానులకు ఏమి చెప్పగలమని బండి, రేవంత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో పీఠిక అంటే మొదటి అక్షరం ఎక్కడ మొదలు అవుతుందో తెలియని వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ ఎజెండాకు ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందించలేని దద్దమ్మలు అని విమర్శించారు.