Constable Kistaiah | తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అందులో ఒకరు కానిస్టేబుల్ కిష్టయ్య. సొంత రాష్ట్ర కల సాకారం కోసం సర్వీస్ రివాల్వర్తో తన ప్రాణాలు తృణప్రాయంగా సమర్పించారు. కిష్టయ్య మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఉద్యమ నేత కేసీఆర్ ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. అవసరమైనవన్నీ సమకూర్చి అమరుడికి అసలైన నివాళి అర్పించారు. కిష్టయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. పిల్లలిద్దరి చదువుల బాధ్యత భుజానికెత్తుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన కిష్టయ్య కొడుకు రాహుల్కు ఎన్సీసీలో జూనియర్ అసిస్టెంట్గా కొలువు ఇప్పించారు. ప్రియాంకను డాక్టర్గా చూడాలనుకున్న తండ్రి కోరిక మేరకు ఖర్చులన్నీ భరించి మెడిసిన్ చదివించారు. అమరవీరుల కుటుంబాలన్నింటికీ ఇచ్చినట్టే కిష్టయ్య కుటుంబానికి కూడా రూ.10 లక్షలు ఇచ్చారు. రెండు గుంటల ఇంటి స్థలం ఇచ్చారు. మెడిసిన్ పూర్తి చేసిన ప్రియాంకకు బస్తీ దవాఖానలో ఉద్యోగం ఇప్పించారు. ఇంటి యజమాని లేడన్న దిగులు తప్ప ఆ కుటుంబానికి ఏ లోటూ రానివ్వలేదు.
కరీంనగర్, మే 6 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 1, 2009, అప్పటికి తెలంగాణ కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి మూడు రోజులైంది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కిష్టయ్య తెలంగాణ కల ఎక్కడ సాకారం కాదోననే నిరాశకు గురయ్యాడు. సెల్టవర్ ఎక్కి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఎవరెంత చెప్పినా టవర్ దిగిరాలేదు. ఎవరైనా దింపే ప్రయత్నం చేస్తే కాల్చేస్తానని హెచ్చరించాడు. భార్యాపిల్లలు వేడుకున్నా దిగిరాలేదు. తెలంగాణ కంటే తనకు కుటుంబం ముఖ్యం కాదని కరాఖండిగా చెప్పేశాడు. రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని వదిలేస్తానని తెగేసి చెప్పాడు. అర్ధరాత్రి 2.45 గంటలకు తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని అమరుడయ్యాడు. అతని మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. కానీ మానవత్వం మూర్తీభవించిన ఉద్యమ నేత కేసీఆర్ అమరుడి ఆకాంక్షలను నెరవేర్చటానికి ఆ క్షణమే కంకణం కట్టుకున్నారు.ఏడాదికి రూ.5 లక్షలతో మెడిసిన్
కిష్టయ్య చనిపోయే నాటికి ఆయనకు భార్య పద్మ, ఇద్దరు సంతానం రాహుల్, ప్రియాంక ఉన్నారు. ప్రియాంక అప్పుడు 7వ తరగతి చదువుతున్నది. కిష్టయ్య ఆత్మత్యాగానికి చలించిపోయిన కేసీఆర్ ఆ క్షణమే ఆ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. పిల్లలిద్దరిని చదివించారు. కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అతని ఉద్యోగం భార్యకు ఇవ్వలేమంటూ ఉమ్మడి పాలకులు తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. వారి మెడలు వంచి కిష్టయ్య భార్యకు ఇంటర్బోర్డులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు కేసీఆర్. ఆందోళన కారుల ఒత్తిడితో అప్పటి ప్రభుత్వం కిష్టయ్య కుటుంబానికి రెండు వందల గజాల ఇంటిస్థలం ఇవ్వటానికి ఉత్తర్వులిచ్చింది. కానీ ఎన్నేండ్లయినా ఇంటి పట్టా మాత్రం ఇవ్వలేదు. స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కిష్టయ్య కుటుంబాన్ని పిలిపించుకుని రెండు గంటల ఇంటి స్థలం ఇచ్చారు. కిష్టయ్య కొడుకు రాహుల్, కూతురు ప్రియాంకను కార్పొరేట్ స్కూల్లో చేర్పించి మంచి విద్యను అందించారు.
రాహుల్ ఇంటర్ పూర్తి చేయగానే నిజామాబాద్ ఎన్సీసీ హెడ్క్వార్టర్స్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇప్పించారు. ప్రియాంకను మాత్రం ఆమె తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదివించారు. కరీంనగర్లోని చల్మెడ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం తరుఫున ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించి ప్రియాంకను చదివించారు. 2021లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక.. ఏడాది పాటు చల్మెడ మెడికల్ కాలేజీలోనే హౌస్సర్జన్ పూర్తి చేశారు. ఇప్పుడు కరీంనగర్లోని తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరారు. ఈ నెల 5న మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్తీ దవాఖానలో వైద్యురాలిగా ప్రియాంక నిరుపేదలకు సేవలందిస్తున్నారు. కిష్టయ్య మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్, ఇప్పుడా ఇంటి పిల్లలను ప్రయోజకులుగా మార్చారు. సీఎం కేసీఆర్ చేసిన మేలును నిత్యం స్మరిస్తున్న కిష్టయ్య కుటుంబం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్తున్నది.
పేదలకు సేవ చేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటామా కుటుంబం కోసం సీఎం కేసీఆర్ ఎంతో చేశారు. ఆయన లేకుంటే మేం ఏమైపోయేవాళ్లమో. మా అమ్మను ఒక కూతురులా ఆదరించారు. ప్రభుత్వోద్యోగం ఇప్పించారు. ఇప్పుడు మా అ మ్మ ఇంటర్మీడియట్ బోర్డులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కేసీఆర్ సారే మా చదువు బాధ్యతలు తీసుకున్నారు. మా అన్న రాహుల్ ఇంటర్ చదువుతున్నపుడే ఉద్యోగం ఇప్పించారు. నన్ను డాక్టర్ను చేయాలని మా నాన్న కన్న కలను సార్ దృష్టికి తెచ్చాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెరీగుడ్ అని అభినందించారు.
చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పారు. ఏడాదికి 5 లక్షలు ఇచ్చి నన్ను డాక్టర్ను చేశారు. మాకు కరీంనగర్లోని సప్తగరి కాలనీలో 2 గుంటల స్థలం ఇప్పించారు. డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించారు. అమరుల కోటా కింద 10 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బు మా అమ్మ నా పేరు మీద ఫిక్స్ చేశారు. కేసీఆర్ సర్ దయతో డాక్టర్నయ్యా. వైద్యురాలిగా సేవలు అందిస్తూనే పీజీ చేస్తాను. గైనకాలజీ చేయాలని ఉన్నది. ప్రభుత్వ డాక్టర్గా పేదలకు సేవలు అందించి కేసీఆర్ సర్ రుణం తీర్చుకుంటా. మా నాన్న పుట్టిన మా సొంత గ్రామం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం శివయ్యపల్లిలో పేదలకు సేవలు చేయాలని ఉన్నది.
– డాక్టర్ ప్రియాంక, కిష్టయ్య కూతురు