‘ఆన్లైన్ గేములతో అంతా పోగొట్టుకున్నాను. నేను చచ్చిపోతున్నా. నా చావుకు మా నాన్నే కారణం. నా కోసం వెతకొద్దు’ అంటూ యాదాద్రి భువనగిరికి చెందిన చేకూరి ప్రసాద్ చివరిసారిగా సెల్ఫీ వీడియో షేర్చేసి అదృశ్యమయ్యాడు. సిద్దిపేటకు చెందిన కానిస్టేబుల్ నరేశ్ ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ నెల 15న భార్య, ఇద్దరు పిల్లలను గన్తో కాల్చి.. తానూ కాల్చుకొని తనువు చాలించాడు. చౌటుప్పల్ గతంలో ఓ మహిళ నీటి సంపులోకి ఇద్దరు కన్న బిడ్డలను తోసేసి తాను ప్రాణాలు తీసుకున్నది. ఈ హృదయ విదారక ఘటనలు మన కండ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. బయట పడినవి కొన్ని మాత్రమే. వెలుగులోకి రానివి మరెన్నో..! ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బలైన కుటుంబాలు ఇంకెన్నో!!
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): టీ-20లు, వన్డేలు, ఐపీఎల్, ఆఖరికి టెస్ట్ మ్యాచ్ అయినా.. ప్రో కబడ్డీ లీగ్ అయినా.. రమ్మీ పేకాటైనా.. వీడియో గేమ్స్ అయినా కాదేదీ ఆన్లైన్ మోసానికి అనర్హం. ఇవేనా.. ఆన్లైన్ స్పాట్, బ్లాక్జాక్, రౌలెట్టె, బక్కార్ట్, పోకర్, తీన్పట్టి, అందర్ బాహర్, ఆన్లైన్ క్యాషినో.. ఇలా చెప్పుకుంటూ పోతే అడ్డంగా దోచుకొనే గ్యాంబ్లింగ్ యాప్లు ఆన్లైన్లో కోకొల్లలు. గతేడాది దేశవ్యాప్తంగా 4.21 కోట్ల మంది ఆన్లైన్ గేమర్స్గా నమోదయ్యారంటే అతిశయోక్తి కాదు.
అందుకే ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మొదట రూపాయల్లో ఆశపెట్టి.. వందల్లో లాభాలు చూపిస్తారు. తర్వాత వేలల్లో ఆశపెట్టి.. లక్షల్లో దోచేస్తారు. రాష్ట్రంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన వస్తుండటంతో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను రూపొందిస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. పలు రకాల గేమ్లపై ప్రజల్లో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. నకిలీ యాప్లను సృష్టించి, వాటి ద్వారా సులువుగా డబ్బులు దండుకుంటున్నారు. కొన్ని యాప్లలో వారే రుణాలు ఇస్తూ మళ్లీ డబ్బులు కట్టించి, అదే గేమ్కు బానిసను చేస్తున్నారు.
విదేశాల నుంచి నిర్వహణ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు చైనా, సౌదీ అరేబియా, అరబ్ దేశాల నుంచి ఆపరేటింగ్ చేస్తుంటారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో వెలుగుచూసిన ‘మహదేవ్’ యాప్ కేసులో ఇదే తేలింది. ప్రముఖులతో యాడ్స్ ఇప్పించడం, అమాయకులను ముగ్గులోకి దించడం, వారి ద్వారా డబ్బులు వసూలు చేయడం, మొత్తంగా గేమ్స్కు బానిసలు చేయడం నిత్యకృత్యమైంది. కొన్ని బెట్టింగ్ యాప్లకు ఉగ్రవాదులు నిధులు సమకూర్చుతున్నారు. వచ్చిన లాభాలను తమ కార్యకలపాలకు వినియోగిస్తున్నారు.
మహదేవ్ యాప్ కేసులో ఇప్పటి వరకు సుమారు 260 మందిని అరెస్టు చేశారు. ఆన్లైన్ గేమ్స్ వల్ల అమాయకులు కోట్లాది రూపాయలు మోసపోతున్నారు. ఆటపై ఉన్న ఇష్టాన్ని వ్యసనంగా మార్చడంతోపాటు తెలివిగా డబ్బులు పెట్టించి, మోసగించడంలో నిపుణులైన యాప్ ఆపరేటర్లకు సుమారు 25-30 శాతం కమీషన్ వెళ్తున్నట్టు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆన్లైన్ గేమ్ మోసాలపై 8 వేలకుపైగా కేసులు నమోదైనట్టు ఐ4సీ ఇటీవల తెలిపింది. ఒక్క మహదేవ్ యాప్ ద్వారానే రూ.6 వేల కోట్ల మోసం జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం 22 బెట్టింగ్ యాప్లను గుర్తించి బ్యాన్ చేసింది .
స్మార్ట్ఫోన్ వాడకం తగ్గించండి
ఆన్లైన్ వేదిక గా ప్రపంచమంతా ఎన్నో దారుణాలు జరుగుతున్న క్రమంలో స్మార్ట్ఫోన్ వాడకం తగ్గించడం మేలు. ఖాళీగా ఉంటూ ఏదైనా చూస్తున్నా కొద్దీ.. ఏవేవో ప్రకటనలు, ఆకర్షించే బొమ్మలు, గేమ్స్, ఇతరాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అప్పటికే ఏదైనా గేమ్పై ఆసక్తి ఉంటే.. దానిని ఆడాలనిపిస్తుంది. అది వ్యసనంగా మారుతుంది. తర్వాత డబ్బులు పెట్టి, నష్టపోయే స్థితికి చేర్చుతుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు. ఇంట్లో ఇబ్బందులు, అప్పుల గొడవలు, మనస్పర్థలు, ప్రశాంతత లేక ఆత్మహత్యల ఆలోచనలు. స్థిమితంగా ఆలోచించండి. ఆన్లైన్ గేమ్స్ వ్యసనం నుంచి బయటపడండి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోండి.
– డాక్టర్ అనంత్, సైకాలజిస్ట్