హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరిగింది కాబట్టే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విషయాలను మీడియాకు వెల్లడించారని, కుట్ర విఫలమైన విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉన్నదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేశారో చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఘటనకు సంబంధించిన అంశాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారని చెప్పారు.
పెన్డ్రైవ్, సీడీల ద్వారా సీజేఐ, హైకోర్టు సీజేలకు పంపించకుండా ఉండాల్సిందని.. పొరపాటు జరిగిందని గత విచారణలోనే అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంటే.. పార్టీ అధినేత హోదాలో ఉన్న సీఎం కేసీఆర్ మాట్లాడకుండా ఎలా ఉండగలరని ప్రశ్నించారు. కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్లిన విషయాలు, స్టార్ హోటళ్లలో బస చేయించిన అంశాలను ఎవరూ మరచిపోలేదని వెల్లడించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తీవ్ర నేరమని, అందుకే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని తెలిపారు.
నిజంగా తప్పు చేయకపోతే దర్యాప్తునకు సహకరించాలి కదా అని ప్రశ్నించారు. బీజేపీకి సంబంధమే లేనప్పుడు నిందితుల తరఫున కేసులు ఎందుకు వేస్తున్నదని నిలదీశారు. పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ప్రమాదంలో పడినప్పుడు పార్టీ అధినేతగా కేసీఆర్ స్పందించి తీరాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. సిట్ దర్యాప్తును రద్దుచేసి సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి, సిట్ జారీచేసిన 41 ఏ నోటీసును సవాలుచేస్తూ ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్ ఇతరులు దాఖలుచేసిన వేర్వేరు వ్యాజ్యాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి బుధవారం సమగ్ర విచారణ జరిపారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో రెండు దఫాలుగా దాదాపు 4గంటలపాటు వాడి వేడిగా వాదనలు జరిగాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ భోజన విరామం దాకా.. విరామం అనంతరం మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు వాదోపవాదాలు సాగాయి.
కేసును అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు
విచారణ ప్రారంభం కాగానే అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జే రామచందర్రావు కౌంటర్ పిటిషన్లను అందజేశారు. నిందితులకు, బీజేపీ నేతలకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల ప్రతిని, ఆ పార్టీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను అందజేశారు. ఒక దశలో ఇరుపక్షాల న్యాయవాదులు సంయమనం పాటించాలని హైకోర్టు హితవు చెప్పింది. దవే వాదనలు కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన క్రిమినల్ కేసులో నిందితులు సిట్ దర్యాప్తునకు సహకరించకపోగా అడుగడుగునా కేసును అడ్డుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఆరోపించారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూనే బీజేపీ కేసులు వేస్తూ అడుగడుగునా అవరోధాలు కలిగిస్తున్నదన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే బీజేపీ ఎత్తుగడలను ఎమ్మెల్యేలు చిత్తుచేశారన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాయబారాలు నిర్వహించడం, తమ పార్టీలోకి ఫిరాయించేలా చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా వంటి రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఉదహరించారు. తమ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్లిన విషయం దేశ ప్రజలకు బహిరంగ రహస్యమేనన్నారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు బీజేపీ ఎరలో పడి ఉంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీజాలు నాటినట్టు అయ్యేదని తెలిపారు.
ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని హైకోర్టును దవే అభ్యర్థించారు. సిట్ దర్యాప్తును ఎందుకు వద్దంటున్నారో కూడా పిటిషనర్లు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును వద్దంటూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కనుసన్నల్లో నడిచే సీబీఐ దర్యాప్తు కోరడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సిట్ దర్యాప్తు లోతుగా సాగుతున్నదని చెప్పారు. అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ముగ్గురు నిందితులకు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పలువురు ఇతర నేతలకు కూడా నిందితులు వలవేశారని చెప్పారు. బీఎల్ సంతోష్, తుషార్ వంటి బలమైన నేతలను కూడా సిట్ విచారిస్తే.. మరిన్ని కీలక విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ దశలో పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చాలని కోరారు. సీఆర్పీసీలోని 41 ఏ సెక్షన్ కింద నిందితులు, సాక్షులు, అనుమానితులు సిట్ దర్యాప్తునకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు.
అధికారులు ఒత్తిళ్లకు లొంగరు
ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తారని.. వారు స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశం లేదని దుష్యంత్ దవే స్పష్టంచేశారు. ఫామ్హౌజ్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న వీడియోలు, వాయిస్ రికార్డింగ్లు ప్రధాన న్యాయమూర్తి, ఇతరులకు పంపడం తప్పేనని, ఈ విషయంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పామని పునరుద్ఘాటించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర గురించి తీవ్రంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతున్నదని, సీబీఐకి బదిలీచేస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
దేశవ్యాప్తంగా అనేక సీబీఐ కేసులు వీగిపోతున్నాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే లక్ష్యంతోనే ఈ తరహా ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉండటం సహజమని.. తమ ఉనికి ప్రమాదంలో పడినప్పుడు పోరాటం చేస్తాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సీఎం ప్రజల్లోకి యుద్ధాన్ని తీసుకెళ్లి చైతన్యపరుస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో మీడియాకు చెప్పడాన్ని తప్పుట్టే వీలు లేదన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.
కేసులో బీజేపీ పేరు కూడా లేదని.. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మర్నాడే హైకోర్టులో కేసు వేసిందని గుర్తుచేశారు. కేసుతో సంబంధమే లేనప్పుడు 24 గంటల్లోగా ఎలా కేసు వేస్తుందని ప్రశ్నించారు. కింది కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేసుకోకుండా హైకోర్టుకు వచ్చి ఆది నుంచి అడ్డంకులు కలిగించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో అవినీతిని అంతం చేస్తామన్న బీజేపీ ఇప్పుడు అదే అవినీతి జెండా పట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదన్నారు. జైల్లో ఉన్న ముగ్గురితోపాటు న్యాయవాది శ్రీనివాస్, తుషార్లకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్లు చెల్లిస్తామని రోహిత్రెడ్డి ద్వారా ప్రలోభాలకు గురిచేశారన్నారు. రెడ్హ్యాండెడ్గా దొరికిన తర్వాత డొంకతిరుగుడు వాదనలు సరికాదన్నారు.
బీఎల్ సంతోష్, ఆర్సీబీ చాటింగ్
బీఎల్ సంతోష్, రామచంద్రభారతి (ఆర్సీబీ) మధ్య వాట్సాప్ చాటింగ్ వివరాలను హైకోర్టు ధర్మాసనానికి సిట్ వెల్లడించింది. ‘ముగ్గురు వ్యక్తులను పరిచయం చేయాలని అనుకున్నాను.. అని ఆర్సీబీ మెసేజ్ పెట్టారు. క్షమించాలి, బిజీగా ఉన్నాను. కలవలేకపోయాను. నమ్మకమైన వ్యక్తి ఏకే సింగ్, మరో కీలకమైన వ్యక్తితో చర్చ చేయాల్సివున్నది.. అని బీఎల్ సంతోష్ రిైప్ల్లె ఇచ్చారు’ అని సిట్ హైకోర్టుకు తెలిపింది. కాల్డాటా, ఫొటోలు, ఇతర ఆధారాలూ ఉన్నాయని పేర్కొన్నది. బీఎల్ సంతోష్, ఆర్సీబీ మధ్య అనేకసార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని వెల్లడించింది. సింహయాజి ఎవరెవరితో సంభాషించారో కాల్ డాటా ఉన్నదని, నిందితులతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయని పేర్కొన్నది. సీఎం కనుసన్నల్లో సిట్ దర్యాప్తు జరుగుతున్నదని పిటిషనర్లు చెప్పటం సరికాదని, సిట్ సేకరించిన అనేక కీలక ఆధారాలు చూస్తే దర్యాప్తు ఎంత లోతుగా జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని సిట్ హైకోర్టుకు నివేదించింది.
సిట్ దర్యాప్తు ఎక్స్ లెంట్
గత 45 ఏండ్ల న్యాయవాద వృతిలో ఏనాడూ చూడని తరహాలో సిట్ దర్యాప్తు జరుగుతున్నదని దుష్యంత్ దవే కితాబు ఇచ్చారు. ఎన్నో సీబీఐ దర్యాప్తులను చూశానని, వాటిని తలదన్నేలా సిట్ దర్యాప్తు ఉన్నదని వివరించారు. దర్యాప్తునకు సంబంధించి ఏ దశలోనూ ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టంచేశారు. సిట్ సమాచారం లీక్ అవుతున్నదన్న ఆరోపణలపై స్పందిస్తూ, బాలీవుడ్ నటిపై ఈడీ కేసు వివరాలు కూడా మీడియాలో వస్తున్నాయని, ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా జరుగుతున్నదని చెప్పారు. సిట్ దర్యాప్తు పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్నదని వివరించారు.
సిట్కు సంబంధం లేదు :సీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వివరాలు మీడియాకు లీకేజీ కావడంపై తమకు సంబంధం లేదని నగర సీపీ, సిట్ ఇన్చార్జి సీవీ ఆనంద్ తెలిపారు. ఏడుగురు నిందితులకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించామని, అలాగే నిందితుల తరఫున న్యాయవాదులకు కూడా ఆ పత్రాలను అందజేశామని వివరించారు.
ఎప్పటినుంచో తెలంగాణ ఆపరేషన్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు తెలంగాణలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ఎప్పటి నుంచో ప్రణాళిక సిద్ధం చేశారని సిట్ నిర్ధారించినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏడుగురు నిందితుల మధ్య సంబంధాలను పూర్తి సాక్ష్యాలతో సహా సేకరించినట్టు చెప్తున్నారు. వీటికి ఫోన్ల లొకేషన్లు, టవర్ సిగ్నల్స్ లాంటి సాంకేతిక ఆధారాలను సైతం జత చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి బుధవారం మీడియా వర్గాలు, వార్తా సంస్థల వద్ద కొన్ని పత్రాలు కనిపిండంతో కలకలం రేగింది.
ఈ పత్రాలు పరిశీలిస్తే ఈ కేసులో ఏ1 రామచంద్ర భారతికి, ఏ4 బీఎల్ సంతోష్కు మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిద్దరు పలుమార్లు కలుసుకున్నారని, ఈ ఏడాది ఏప్రిల్లోనే ‘ఆపరేషన్ తెలంగాణ’ గురించి చర్చించుకున్నారని వారి సెల్ఫోన్లలోని డాటా ఆధారంగా తెలుస్తున్నదని సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలుపై వీరు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 26 వరకు వాట్సప్లో తరచూ చర్చించినట్టు సమాచారం. దీంతోపాటు ఈ కేసులో లొంగిపోయిన ముంజగల్ల విజయ్ అనేక విషయాలను సిట్కు వివరించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు వీడియో ఆధారాలను సైతం సిట్ జోడించినట్టు తెలుస్తున్నది.
ఈ ఏడాది ఆగస్టు 21న రామచంద్రభారతి, సింహయాజి, అడ్వకేట్లు ప్రతాప్, వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు కేసీ పాండే కలిసి ఢిల్లీలోని పాండే ఇంట్లో సమావేశమైనట్టు అడ్వకేట్ ప్రతాప్ సిట్కు వివరించాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 4న రామచంద్రభారతి, నందు, సింహయాజి, అడ్వకేట్ శ్రీనివాస్ ఢిల్లీలోని వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్లో మరోసారి సమావేశం అయ్యారని, వారందరి ఫోన్ల లొకేషన్ అక్కడే ఉండటమే ఇందుకు నిదర్శనమని ప్రతాప్ పేర్కొన్నట్టు సమాచారం.
మరోవైపు సింహయాజి స్కై హై హోటల్లో పలువురు రాజకీయ నాయకులతో సమావేశమై ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆకర్షించడంపై చర్చించారని, ఆ తర్వాత తెలంగాణ జనసమితి నుంచి కోదండరాంను, కాంగ్రెస్ నుంచి రాజనర్సింహను బీజేపీలోకి ఆహ్వానించారని కథనాలు వినిపిస్తున్నాయి. రామచంద్ర భారతి, నందు, సింహయాజి, అడ్వకేట్లు శ్రీనివాస్, ప్రతాప్, విజయ్కుమార్ గతంలో ఓసారి నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలోనూ భేటీ కావడంతోపాటు సెప్టెంబర్ 26న నందకుమార్ ఇంట్లోనూ సమావేశమై ఎమ్మెల్యేల కొనుగోలు గురించి చర్చించారని వారి ఫోన్ల లొకేషన్లు, విజయ్కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ గుర్తించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అంతకుముందు వీరు సెప్టెంబర్ 15న బీఎల్ సంతోష్ నివాసంలోనూ భేటీ అయినట్టు సమాచారం. ఆ సమావేశంలో బీఎల్ సంతోష్, తుషార్, రామచంద్ర భారతి, నందకుమార్, విజయ్కుమార్ చర్చలు జరిపారని సిట్ గుర్తించినట్టు తెలుస్తున్నది.