మంచిర్యాల, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక జరగకుండా అడ్డుకొని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ను అరెస్టు చేయించిన సర్కార్, పీడీ యాక్ట్ పెట్టించి నెల రోజులు జైలులో ఉంచే దిశగా అడుగులు వేస్తున్నదంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పేర్కొన్నారు. బాల్కసుమన్పై క్యాతనపల్లిలో నమోదైన కేసు విచారణ కోసం గురువారం న్యాయవాది కల్యాణ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు, బాల్క సుమన్ ప్యానల్ అడ్వకేట్లతో కలిసి మంచిర్యాల జిల్లా కోర్టులో వాదనలు వినిపించారు. బాల్కసుమన్ బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన కోర్టు, కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు వెల్లడించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా కోర్టులో బాల్క సుమన్ బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణకు ప్రాసిక్యూషన్ కావాలని జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. సుమన్ను జైలులో ఉంచి, కౌన్సిలర్ల మీద ఒత్తిడి తెచ్చి క్యాతనపల్లి మున్సిపాలిటీ దక్కించుకోవాలనే కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగామారి సుమన్పై అక్రమ కేసులు నమోదు చేశారని వెల్లడించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 కౌన్సిలర్లలో 14 స్థానాలు బీఆర్ఎస్-సీపీఐ గెలిచిన నేపథ్యంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఓటింగ్కు వెళ్లాల్సిన అవసరమేలేదని స్పష్టంచేశారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుమన్పై నమోదైన 19 కేసులను తిరగదోడి పీడీ యాక్ట్ పెట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పారు. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు మరో ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. సమన్ను అరెస్టు చేయించినందుకు మంత్రి వివేక్కు సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ జిల్లాలో 1.37 ఎకరాలు గిఫ్ట్గా ఇచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. బాల్క సుమన్ కేసు విచారణ సందర్భంగా మంచిర్యాల జిల్లా కోర్టుకు వచ్చిన కోనప్ప న్యాయవాదులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికను అడ్డుకున్న అధికార పార్టీ, బాల్క సుమన్పై తప్పుడు కేసులు పెట్టి అనేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షెట్టిపేటలో జైలు ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జైలుకు తీసుకెళ్లి హింసిస్తున్నారని తెలిపారు. ఖమ్మంలో పేద ప్రజల ఇండ్లు కూల్చివేసి వారిని దిక్కులేనివారిని చేయడం రాష్ట్రం మొత్తం చూసిందని చెప్పారు.