హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింస కు తావులేదు. రాజకీయాల్లో భౌతిక దాడులు సరికాదన్నారు.
ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేదని మంత్రి అన్నారు. ప్రజా జీవితం ప్రజల సేవకు అంకితం. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. తప్ప నేరమయం చేయవద్దన్నారు. అలా ఎవరైనా ఆలోచించినా తప్పే అన్నారు. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలన్నారు.
కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం ఆక్షేపనీయం. పాలమూరు జిల్లా ప్రశాంతమైన జిల్లా. ఆ వాతావరణం కలుషితం కావద్దు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.