హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి లబ్ధిపొందాలనుకొనే కుట్రలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. నాడు ఆంధ్రాబాబు చంద్రబాబునాయుడు పార్టీ బరితెగిస్తే.. ఇప్పుడు అదే వక్రబుద్ధిని కాషాయ పార్టీ నిస్సిగ్గుగా ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయింది.
డబ్బు కట్టలతో దొరికిన రేవంత్రెడ్డి
పదవులే పరమావధిగా…నాడు టీడీపీ చేసిన ప్రలోభాలు ఇప్పటికీ అందరికీ గుర్తే ఉన్నది. తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చి.. రూ.50 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చేందుకు వెళ్లిన అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, నేటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డబ్బు కట్టల సంచితో దొరికిన విషయం తెలిసిందే. బాస్ (చంద్రబాబునాయుడు) సూచనతో వచ్చినట్టు రేవంత్రెడ్డి తన మాటల్లో పదేపదే చెప్పినట్టు వీడియోల్లో రికార్డయ్యింది. నాటి కుట్ర బయటకు రావడంతో కుతంత్రాల చంద్రబాబు తెలంగాణ నుంచి జారుకొని ఏపీకి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదోరకంగా ఇబ్బంది పెట్టేందుకు పన్నే కుట్రలన్నింటినీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అడ్డుకొంటూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు.
అచ్చంగా అదే ప్లాన్… మళ్లీ అడ్డంగా బుక్కయ్యారు..
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గింది.. అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమవైపు వస్తున్నారంటూ మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసిన కాషాయ పార్టీ.. తాను తీసుకొన్న గోతిలో తానే పడింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు ఏకంగా ఢిల్లీలోని కాషాయ పెద్దలు స్కెచ్ వేశారు. ఢిల్లీ టు హైదరాబాద్ వయా తిరుపతి అన్న రీతిలో జరిగిన ఈ కుట్ర కోణాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ముందుగానే ఉప్పందడంతో సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్లో అసలు దొంగల రంగు బయటపెట్టారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ డీల్ను వెలుగులోకి తెచ్చారు. డబ్బు సంచులతో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు.