కోస్గి, ఫిబ్రవరి 20 : రేవంత్ పాలనలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. మొన్న సర్జఖాన్పేటలో సర్పంచ్ అభ్యర్థులపై దాడి, నిన్న పోతిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై దాడి, గురువారం అర్ధరాత్రి కోస్గి మున్సిపాలిటీలోని 5వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. మాసాయిపల్లిలో గులాబీ కార్యకర్తలు జీ వెంకటయ్య, బోడ వెంకటయ్య తమ వార్డులో కూర్చొని మాట్లాడుతుండగా.. అటుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్త ఎల్లప్ప వారితో వాగ్వాదానికి దిగాడు. ‘మీరెందుకు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు.. ఇది మా కాంగ్రెస్ అడ్డా.. నన్నెవరూ ఏమీ చేయలేరు’.. అంటూ వారిని దుర్భాషలాడారు. స్థానికులు వారిస్తున్నా పట్టించుకోకుండా మద్యం మత్తులో వారిపై రాళ్లతో దాడి చేశాడు. దీంతో ఇద్దరు తలలు పగిలాయి. స్థానికుల సాయంతో వారిని దవాఖానకు తరలించిగా చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.