జనగామ, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ వేదికగా కొమ్మూరి, పొన్నాల వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు తన వర్గీయులతో బల ప్రదర్శనతో స్వాగతం పలికేందుకు పోటీపడటం కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. నినాదాలు.. ప్రతి నినాదాలు చేస్తూ చొక్కాలు పట్టుకొని కొట్లాటకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఆ తర్వాత కొమ్మూరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పొన్నాల చేయి పట్టుకొని భట్టి పాదయాత్రను కొనసాగించారు.
భట్టి విశ్రాంతి శిబిరంలో పొన్నాల సహా మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూర్చోని ఉండగా కొమ్మూరి తన అనుచరులతో అక్కడకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పొన్నాల వర్గీయులు నెట్టేశారు. సాయంత్రం యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే కొమ్మూరి వర్గీయులు భట్టి యాత్ర ముందుకు సాగకుండా రోడ్డుపై అడ్డుగా ఉండి తమ నాయకుడిని ఎందుకు పక్కన బెట్టారంటూ వాదనకు దిగడంతో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో భట్టి కొద్దిదూరం కొమ్మూరితో కలిసి నడిచారు. ఈ క్రమం లో పొన్నాల వర్గీయులు ఆయన్ను వెనక్కినెట్టారు. రాత్రి 9 గంటలకు యాత్ర నర్మెటకు చేరుకోగానే పొన్నాల గోబ్యాక్.. అంటూ కొమ్మూరి అనుచరులు నినాదాలు చేస్తూ రోడ్డుకు అడ్డుగా నిలవడంతో భట్టి యాత్ర కొద్దిసేపు నిలిచిపోయింది. ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పరం దాడులకు సిద్ధం కావడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చేయాల్సి వచ్చింది.