Seethakka | ములుగు, నవంబర్ 23 (నమస్తేతెలంగాణ): ములుగు నియోజకవర్గంలో నిరంతరం ప్రజాసేవలోనే మునిగితేలుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హల్చల్ చేసే స్థానిక ఎమ్మెల్యే సీతక్క.. అదే స్థాయిలో రోజుకో అవినీతి ఆరోపణలతో జనం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది. గతంలో సీతక్క అనుచురులు దళితబంధు పేరుతో దళితుల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయంలో విమర్శల పాలయ్యారు. ఆ ఘటనను మరువక ముందే గురువారం మరో అవినీతి ఆరోపణ వెలుగుచూసింది. ఈ సారి అవినీతికి పాల్పడింది ఏ కాంగ్రెస్ నాయకుడో లేదా ఆమె అనుచరుడో కాదు.. స్వయాన సీతక్క తనయుడు సూర్యనే ‘దళితబంధు’తో వసూళ్లకు పాల్పడ్డాడని సాక్షాత్తు బాధితుడే ఆరోపించాడు.
ఈ మేరకు బాధితుడు, ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు అంకేశ్వరపు దయాకర్ మీడియా ముందు తన గోడు వెల్లబోసుకున్నాడు. ‘ఎనిమిది నెలల క్రితం తాడ్వాయి మండలం కాటాపూర్కు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు మర్రి నరేశ్ నాకు దళితబంధు ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో నేను, నరేశ్ కలిసి జగ్గన్నపేటలో సీతక్క కుమారుడు సూర్యతో మాట్లాడగా.. దళితబంధు రావాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. వెంటనే రూ.2 లక్షలను నా ఖాతా నుంచి నరేశ్ బా్ంయక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాను. మిగిలిన రూ.లక్ష నగదును సూర్యకు ఇవ్వాలని నరేశ్కు ఇచ్చాను. మొత్తం రూ.3 లక్షలు చెల్లించిన విషయాన్ని సూర్యకు తెలుపగా.. దళితబంధు లిస్టులో నీ పేరు ఉంటదని చెప్పాడు.
తీరా లబ్ధిదారుల లిస్ట్ చూస్తే అందులో నా పేరు లేదు. దీంతో సూర్యను నా డబ్బులు ఇవ్వాలని పలు మార్లు అడిగితే.. రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. పైగా.. నాకు నీ ద్వారా రూ.2 లక్షలే వచ్చాయి. మిగిలిన రూ.లక్ష మర్రి నరేశ్ తీసుకున్నాడు. నేను రూ.2 లక్షలే ఇస్తా. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ సూర్య బెదిరించాడని బాధితుడు వెల్లడించాడు. తనకు న్యాయం చేయాలని ములుగులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశానని చెప్పాడు. కాగా.. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పూర్తి సబ్సిడీతో రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంటే.. ఎమ్మెల్యే సీతక్క కుమారుడు, అనుచరులు దళితబంధు ఇప్పిస్తామని ఆశచూపి దళితుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.