KTR | ఉగాదులు, ఉషస్సులు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. ప్రజల జీవితాల్లో వెలుగులేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం డిజాస్టర్ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎగనామాలు.. పంగనామాలు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీల కోసం కోటి 25 లక్షల మంది చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. గ్యారంటీ కార్డులు బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తున్నాయని అన్నారు. ఇండియా క్రికెట్లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది.. అదే 420 వరల్డ్ కప్ పెడితే కాంగ్రెస్ ఫస్ట్ వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చారాణా పని చేసి.. బారాణ చేసినట్లుగా చెప్పుకుంటుందని అన్నారు. నేనే రాజు.. నేనే మంత్రి అని మిడిసి పడితే మూటకట్టుకుని పోతారని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి తొలి సంతకం చేసిన ఫైల్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మాయమైన ఫైల్ కోసం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మూసీలో ముంచుతున్న ఇండ్లకు జీరో వాల్యూ కాదు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ అని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు, డిక్లరేషన్లకు ప్రజల్లో జీర వాల్యూ అని అన్నారు. విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ అని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కర్ణుడిని అని చెప్పుకంటున్నాడని.. ఆయన ఎన్నికల ముందు దానకర్ణ.. ఇప్పుడు కుంభకర్ణ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. డిక్లరేషన్ల కోసం ఢిల్లీ నుంచి విమానాలు వేసుకుని వచ్చారని.. కానీ వాటిని అమలు మాత్రం చేయడం లేదని అన్నారు. ఇక తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది
కాంగ్రెస్ 420 వరల్డ్ కప్ గెలిచింది pic.twitter.com/YdTdhA5WJN
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2026